విభజన: జగన్కంటే హైటెక్ బాబుని కోరుకుంటున్నారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు టిడిపి నేతలు. రాష్ట్ర విభజన జరిగినందున సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని టిడిపి నేతలు మొదటి నుండి చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు ఈ రోజు(సోమవారం) వెలువడ్డ మున్సిపల్ ఫలితాలు తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సీమాంధ్రలో ఫలితాలు ఏకపక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు ఉంటాయని అందరూ భావించారు. కానీ 92 స్థానాలకు గాను టిడిపి 64 స్థానాల్లో గెలవగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమయింది.
ఈ ఫలితాలను ఉదాహరణగా చూపుతూ టిడిపి నేతలు తమ గళం మరింతగా పెంచారు. రేపు పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత మే 16వ విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుకు పాలనానుభవం ఉందని, తన తొమ్మిదన్నరేళ్ల హయాంలో హైదరాబాదును, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, దానిని గుర్తించిన సీమాంధ్ర ప్రజలు కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని గుర్తించారని చెబుతున్నారు. చంద్రబాబు వస్తే సీమాంధ్రను హైదరాబాదులా అభివృద్ధి చేస్తారని, జగన్ వస్తే మరింత దోచుకుంటారని ప్రజలు భావించారని అందుకే తమ వైపు మొగ్గు చూపారని టిడిపి నేతలు చెబుతున్నారు.
అయితే, మున్సిపల్ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు తేడా ఉంటుందని, ఈ రెండు ఎన్నికలను పోల్చలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలిచినా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తమదే గెలుపు అని చెబుతోంది. తాము మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కాలేదని, అలాగే జగన్ను ప్రజలు సిఎంగా చూడాలనుకుంటున్నారని, ఆ ఎన్నికలు లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు మాత్రమేనని, అది ప్రజలకు తెలుసునని, ఆ ఎన్నికల్లో ఫ్యాను జోరు ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications