స్వరూపానందేంద్ర ప్రయత్నాలు..! జగన్-సుబ్బిరామిరెడ్డి చెలిమి జరిగే పనేనా?
విశాఖపట్నం : రాజకీయాల్లో శాశ్వత శతృత్వానికి.. శాశ్వత మితృత్వానికి తావు లేదంటారు. రాజకీయంగా ఏర్పడే కొన్ని అనివార్యతలు నేతలను ఆ దిశగా నడిపిస్తాయి. ఏపీలో అధికారాన్ని చేజిక్కుంచుకోవడం జగన్ కు అనివార్యం.. అందుకు అవసరమైన మేర పార్టీని బలోపేతం చేసుకునే చర్యలు జగన్ ఇప్పటినుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. గత ఎన్నికల్లో అనూహ్యంగా కోల్పోయిన విశాఖ స్థానంపై వచ్చే ఎన్నికల నాటికైనా పట్టు నిలుపుకోవాలని యోచిస్తున్నారు జగన్. ఇదే క్రమంలో ఇప్పుడాయన చూపు విశాఖ కాంగ్రెస్ నేత సుబ్బిరామిరెడ్డిపై పడ్డట్లు తెలుస్తోంది. విశాఖ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుబ్బిరామిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి విశాఖలో పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో జగన్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే వీరిద్దరిని ఒక్క దగ్గరికి చేర్చడం కోసం విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర చొరవ తీసుకుంటున్నారనే వాదన కూడా తెరపైకి వస్తోంది. కొంతకాలంగా జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న స్వరూపానందేంద్ర స్వామి.. జగన్ తో జత కట్టడానికి సుబ్బిరామిరెడ్డిని ఒప్పించగలరా అన్నది కూడా ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే.. దశాబ్దాలుగా అటు కాంగ్రెస్ హైకమాండ్ కు పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తోన్న సుబ్బిరామిరెడ్డి ఇంతటి అనూహ్య నిర్ణయం తీసుకుంటారా అన్నది అనుమానమే.
పైగా.. సుబ్బిరామిరెడ్డికి ఉన్న వ్యాపార విస్తృతి దృష్ట్యా.. ఓ జాతీయ పార్టీని కాదని, ప్రాంతీయ పార్టీలో చేరడానికి ఆయన మొగ్గు చూపుతారా అన్నది కూడా ఆయన పార్టీ మార్పు అంశం అంత సులువుగా సాధ్యమయ్యే వ్యవహారం కాదని తెలియజేస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఏకంగా అధినేత జగన్ మాతృమూర్తి విజయమ్మకే విశాఖలో పరాభవం ఎదురవడంతో.. ఈ దఫా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి పార్టీని పూర్తిగా బలోపేతం చేసే జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సుబ్బిరామిరెడ్డి ఎంట్రీ గురించిన చర్చ మొదలైంది. చూడాలి మరి.. ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమవుతాయో..! లేక నిజంగానే సుబ్బిరామిరెడ్డి-జగన్ మధ్య చెలిమి చిగురిస్తుందో..!