గ్లామర్కోసం జగన్ తహతహ: ప్రిన్స్, ఎన్టీఆర్లకు గాలం?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులు స్టార్ అట్రాక్షన్ కోసం చూస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలోకి సినీ, టీవి తారలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇందుకోసమే సినీ, టివీ ఆర్టిస్టులతో గత ఆదివారం ఆ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, మరోసారి సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రస్తుతం ప్రముఖ నటి రోజా, విజయచందర్లు కీలక నేతగా ఉన్నారు. పోసాని కృష్ణ మురళీ, గిరిబాబు వంటి వారు ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల కంటే వారు సినిమాల పైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. రోజా పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ గతంలో పలుమార్లు అధిష్టానంపై అసంతృప్తిగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

జగన్ పార్టీ స్థాపించాక హీరో రాజశేఖర్ దంపతులు ఆ పార్టీలో చేరారు. కానీ జగన్ తమ పట్ల వ్యవహరించిన తీరు సరిగాలేదని ఆరోపిస్తూ జీవిత, రాజశేఖర్లు ఆ పార్టీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికలలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో పలువురు దర్శకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు అగ్రశ్రేణి కథానాయకుల పైన కూడా దృష్టి సారించిందని అంటున్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారని, ఇందుకు జూనియర్తో ప్రచారం చేయించాలనే షరతు కూడా జగన్ విధించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జూనియర్, హరికృష్ణలతో నారా కుటుంబం సయోధ్యకు ప్రయత్నిస్తోందట.
ప్రిన్స్ మహేష్ బాబు ఇమేజ్ను కూడా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావించిందట. ఇందుకోసం సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలపై దృష్టి సారించిందని కానీ, అది ఫలించలేదంటున్నారు.












Click it and Unblock the Notifications