పొత్తు కోసం గిలగిల: ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా... జగనే చెప్పారు? అదే కీలకమని భావిస్తున్న వైసీపీ!!
అమరావతి: జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈసారైనా గెలుద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తోందా? అంటే కొట్టి పారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో లోపల జరిగేది ఒకటి, పైన జరిగేది మరొకటిగా ఉంటుంది. తాము పార్టీ మారడం లేదని చెప్పేవారే, రెండు రోజుల్లో పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి. తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదని చెప్పే పార్టీలు.. ఆ తర్వాత ఎప్పుడైనా కలువొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీలు కూడా జనసేనతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయనే వాదనలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.

వైసీపీపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ బాహాటంగానే సిద్ధమన్నట్లుగా మాట్లాడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు కూడా తమతో కలిసి రావాలని చెప్పారు. కానీ వారితో కలిసేందుకు పవన్ నో చెప్పారు. తాను అధికార (టీడీపీ), ప్రతిపక్ష (వైసీపీ)లతో కలిసేది లేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు వామపక్షాలతో కలుస్తానని తేల్చి చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. టీడీపీ బాహాటంగానే ఆహ్వానిస్తోంది. కానీ పవన్ ఇటీవల వైసీపీని ఉద్దేశించి, ఆ పార్టీ తెరవెనుక తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో పొత్తు కోసం టీడీపీతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడమే మన బలానికి నిదర్శనమని చెప్పారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ ఆరాటం నిజమేనా, ఎందుకంటే?
పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వైసీపీ వెంపర్లాడటం నిజమేనా? అయితే ఎందుకు అనే కోణాల్లో సామాన్యుల నుంచి నాయకుల వరకు చర్చ సాగుతోంది. రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చినప్పటికీ ఆయనకు ఉన్న అభిమానగణం, ఓటు బ్యాంకు ఎక్కువ. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఆయన బలం టీడీపీ, వైసీపీల కంటే ఎక్కువగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లోను ఈ జిల్లాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారనే వాదనలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ గెలిపించారని జగనే చెప్పారు
2014లో టీడీపీ గెలుపు వెనుక మోడీ హవాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని స్వయంగా వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నాయకులు పలుమార్లు ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి టీడీపీ గెలుపులో పవన్ పాత్ర ఉందని వైసీపీతో పాటు 2014లో గెలిచిన కొత్తలో టీడీపీ నేతలు కూడా చెప్పారు. ఓ విధంగా తమ అధినేత బలం గురించి జగన్తో పాటు వైసీపీ, టీడీపీ నేతలు స్వయంగా అంగీకరించారని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. దానికి తోడుగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్ష నేతలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో అదే ఎంతో కీలకం
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కీలకం కానుంది. సాధారణంగా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది. జగన్, పవన్ కళ్యాణ్ లెక్కల్లో.. ఇప్పుడు ప్రభుత్వ ఓటు బ్యాంక్ ముఖ్యం. ఇప్పుడు జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీతో పాటు జనసేనకు కూడా వెళ్తుందని వైసీపీ నేతలు భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేతపై ఉన్న అవినీతి కేసులను టీడీపీ పదేపదే ప్రస్తావిస్తోంది. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... జగన్ విషయంలో టీడీపీకి ఉన్న ఒకే ఆయుధం అవినీతి కేసులు అని చెప్పారు. అదే సమయంలో జనసేన పైన రాజకీయపరంగా ఎలాంటి ఆరోపణలు లేవనే వాదనలు కోకొల్లలు. ఇది జనసేనకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. పవన్ ఇలాగే దూసుకెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా జనసేన వైపు మరలుతుందనే ఆందోళన కూడా వైసీపీలో ఉందేమోననే చర్చ సాగుతోంది. దానికి తోడు టీడీపీ, వైసీపీలకు ధీటుగా కాకపోయినా ఆ స్థాయిలో జనసేన పుట్టగానే ఓటు బ్యాంక్ కలిగి ఉంది.

జనసేనతో పొత్తుపై వైసీపీ కొట్టి పారేస్తోంది కానీ..
ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందేమోననే భయం వైసీపీలో ఉండవచ్చునని అంటున్నారు. అదే జనసేనతో కలిస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు కోసం తాము ప్రయత్నాలు చేయలేదని, అసలు అలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్కే ఉందేమోనని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ పైలెక్కల కారణంగా వైసీపీ.. పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నాలు చేస్తుందనే వాదనను పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు.

వైసీపీలో మరో భయం
2014లో తమ అతివిశ్వసం వల్లే ఓడిపోయామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండుసార్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, పొత్తులపై జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెడితే, 2019 ఎన్నికల్లోను పొత్తులకు జగన్ నిజంగానే దూరమని అంటే కనుక మళ్లీ ఆ అతివిశ్వాసమే వైసీపీ కొంపముంచుతుందా అనే చర్చ కూడా వైసీపీలో జరుగుతోందట. రాజకీయాల్లో ఇలాంటివి సరికాదని కింది కేడర్లో చర్చ సాగుతోందట. జగన్ తీరుపై అసంతృప్తితో 23 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు వైసీపీని వీడారు. జనసేన ఒంటరి పోరు చేస్తే వైసీపీకే నష్టమని కొంతమంది వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కాబట్టి పొత్తుతో కలిసి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారట. పొత్తుల విషయంలో టీడీపీ బాహాటంగానే జనసేనకు స్వాగతం పలికింది. పవన్ కళ్యాణ్ కూడా తాము వామపక్షాలతో తప్ప ఎవరితోను కలిసేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు. వైసీపీ కూడా తాము ఒంటరిపోరు చేస్తామని చెబుతోంది. కానీ నేతల వ్యాఖ్యలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీంతో లోలోన చర్చలు జరుగుతున్నాయా, ఏమవుతోందనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications