ఇస్రో.. సముద్రాలపై సరికొత్త స్టడీ- నింగిలోకి ఓషన్శాట్: ప్రత్యేకతలివే..!!
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఇవ్వాళ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించబోతోంది. ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ54ను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించడానికి సర్వ సన్నద్ధమైంది. ఈ ఉదయం 11.56 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఎనిమిది ఉపగ్రహాలు..
ఈ పీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక తన వెంట తొమ్మిది ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. ప్రధానంగా దీని పేలోడ్ ఓషన్శాట్. దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీనితో పాటు ఎనిమిది ఇతర నానో-ఉపగ్రహాలను తీసుకెళ్లనుంది. మొత్తంగా వాటి బరువు 321 టన్నులు. ఈ వాహక నౌక ఎత్తు 44.4 మీటర్లు. పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ వర్షన్లో ఇది 24వది. థ్రస్టర్లను మండించడం ద్వారా దీన్ని నింగిలోకి పంపింస్తారు ఇస్రో శాస్త్రవేత్తలు.
సముద్రాలపై
అంతరిక్షంలో ప్రవేశపెట్టదలిచిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.. ఓషన్శాట్. ఓషన్శాట్ సిరీస్లో ఇది మూడోది. ఇదివరకే ఇస్రో ప్రయోగించిన ఓషన్శాట్-2తో ఇది అనుసంధానమౌతుంది. ఫలితంగా- ఇప్పుడు కొనసాగుతున్న అధ్యయనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవు. సముద్రాలపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇప్పుడు తాజాగా పంపించనున్న ఓషన్శాట్ శాస్త్రవేత్తలకు సహకరిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను ముందస్తుగా గుర్తించడానికీ వీలు ఉంటుంది.
ఇతర పేలోడ్స్..
మిగిలిన ఎనిమిది పేలోడ్స్లల్లో నానో శాటిలైట్స్ ఉన్నాయి. అమెచ్యుర్ రేడియో కమ్యూనికేషన్ నానో శాటిలైట్స్ అవి. వాటిని థైబోల్ట్-2, థైబోల్ట్-2గా పిలుస్తారు. భూటాన్కు చెందిన భూటాన్శాట్, బెంగళూరుపిక్సెల్ కంపెనీకి చెందిన ఆనంద్, సియాటెల్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న స్పేస్ఫ్లైట్ అనే సంస్థకు చెందిన నాలుగు ఇతర ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పీఎస్ఎల్వీ-సీ54 ద్వారా నింగిలోకి పంపించనున్నారు.
చెంగాళ్లమ్మ గుడిలో..
ఈ ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్.. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు. ఆయా ప్రాజెక్టులు, పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ నమూనాలను అమ్మవారి పాదల వద్ద ఉంచారు. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా- అది విజయవంతం కావాలని ప్రార్థిస్తూ ఇస్రో ఛైర్మన్లు చెంగాళమ్మ అమ్మవారిని దర్శించడం ఆనవాయితీ. డాక్టర్ సోమనాథ్ కూడా దాన్ని కొనసాగించారు.