పవన్ కళ్యాణ్ సూచన: అయినా ఎపికి ప్రత్యేక హోదా హుళక్కే?
న్యూఢిల్లీ: సమయం చూసి పవన్ కళ్యాణ్ తన మాటను బయటపెట్టినప్పటికీ ప్రధాని మోడీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి ప్రత్యేక హోదా కల్పించడానికి సిద్ధంగా లేనట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆందోళనలకు దిగినా ఫలితం ఉండేట్లు కనిపించడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఏ విధమైన ప్రకటన ఉండబోదని అంటున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపిలకు సూచించారు.
ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై బిజెపి మాటల నిలబెట్టుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు. నిరుడు రాష్ట్ర విభజన బిల్లుకు అస్తవ్యస్తమైన రీతిలో కాంగ్రెసు పార్లమెంటులో ఆమోదం పొందిందని, విభజనకు బిజెపి కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని బిజెపి కూడా హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. ఆ మాట మీద నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. అయితే, అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఏ రాష్ర్టానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు మాత్రమే ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో హోదాకు సంబంధించి గతంలో ఉన్న నిబంధనలనే పెట్టింది. దీంతో ప్రత్యేక హోదా ఏ రాష్ర్టానికి దక్కేది లేదని తెలియవచ్చింది.
ప్రత్యేక హోదా అనేది 1969 నుంచి ప్రారంభమైంది. 5వ ఫైనాన్స్ కమిషన్ దానిపై ఒక నివేదిక తీసుకువచ్చింది. మొదట్లో అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ ఈ మూడు రాష్ర్టాలకు మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు విస్తరించారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, మిజోరాం, త్రిపుర, ఉత్తరాఖాండ్ - మొత్తం 11 రాష్ర్టాలకు మాత్రమే ప్రత్యేక హోదా కల్పించారు.
ఇక మీదట ప్రత్యేక హోదా కల్పించాలంటే దీనికి సంబంధించిన నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలే నిబంధనల సడలింపుపై ఎలాంటి వ్మాఖ్యలు చేయలేదు. ఈ బడ్జెట్లో ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదాపై ఒక ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అయితే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కనిపించడంలేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ ఆధారంగానే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలని ముందు భావించారు. అయితే దానికి సంబంధించి ఆర్థిక సర్వేలో ఎలాంటి ప్రకటన చేయకుండా లోటు బడ్జెట్ను మాత్రమే పూర్తి చేయాలని సిఫార్స్ చేసింది.