మంచి ప్యాకేజీనేనంటూ సజ్జల రామకృష్ణారెడ్డి: తమకు కాదంటూ ఉద్యోగ సంఘాల నేతలు
అమరావతి: ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని, 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారనే విషయంపై నేతలతో చర్చించారు.

ఉత్తమ ప్యాకేజీనే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 14.29 శాతం ఫిట్మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదని, ఎక్కువగానే లబ్ధి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందన్నారు. కరోనావైరస్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసిందని సజ్జల తెలిపారు.

సీపీఎస్పై త్వరలోనే స్పష్టత: సజ్జల
సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన ఫిట్మెంట్ను పెంచే అవకాశం ఉందని సజ్జల అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పీఆర్సీ అమలుకు ఏడెనిమిదేళ్లు పడుతోందని, సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదన్నారు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారన్నారని, దీనిపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. త్వరలోనే సీపీఎస్పై స్పష్టం వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు కొనసాగించారు. ముందుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సజ్జల.. తరువాత ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు.

తమకైతే మంచి ప్యాకేజీ కాదంటూ ఉద్యోగ సంఘాల నేతలు
భేటీ అనంతరం ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ అంశాలు సహా 70 డిమాండ్లు అమలు పై సజ్జలతో చర్చించామని, తమ డిమాండ్లను సీఎం వద్దకు తీసుకెళ్లతామన్నారని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ పై తాము చాలా నమ్మకంతో ఉన్నామని, సీఎస్ ఇచ్చిన ప్రతిపాదనలు తమకు మేలు చేసే పీఆర్సీ కాదన్నారు. సీఎస్ కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి మేలు చేసేదే కాని, ఉద్యోగులకు మేలు చేసేది కాదని చెప్పామన్నారు బండి శ్రీనివాస్. ప్రతిపాదనలు అమలు చేస్తే ఉద్యోగుల ఉనికికే ప్రశ్నార్థకం అవుతుందని, ఉద్యోగులకు 55 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సజ్జలను కోరామన్నారు. హామీలు అమలయ్యే వరకు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశామన్నారు. అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరామని, సీఎం తమ డిమాండ్లకు సానుకూలంగా ఉన్నారని భావిస్తున్నామన్నారు. అంతేగాక, నిరాశ నిస్పృహలోకి వెళ్లిన ఉద్యోగులకు సంతోషం కల్గించే వార్త సీఎం జగన్ చెబుతారని ఆశిస్తున్నామన్నారు. తమకు 14.29శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ చెప్పడం సరైంది కాదన్నారు. 1-7-2018 నుంచి 55శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని, ఎంత ఫిట్ మెంట్ ఇస్తారనేది సీఎం ఇష్టమని బండి శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లు కమిటీ సిఫార్సులు లేవని, మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్నారు. బుధవారం సీఎం జగన్తో భేటీ ఉంటుందని సజ్జల తెలిపారని చెప్పారు.












Click it and Unblock the Notifications