వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ నలుగురు : అనూహ్యంగా తెర పైకి - సీఎం జగన్ ఎంపిక వెనుక...!!
ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది ఎవరు. సీఎం జగన్ మదిలో ఉన్నదెవరు. ఈ అవకాశం తప్పితే ఇప్పట్లో ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం లేదు. దీంతో...ఆశావాహులు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకొనేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీఎం జగన్ ఎప్పటి లాగానే పక్కా సామాజిక సమీకరణాలతో జాబితా సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, రాజ్యసభ విషయంలో మాత్రం జగన్ భవిష్యత్ ప్రయోజనాలు.. జాతీయ స్థాయి సంబంధాలను సైతం పరిగణలోకి తీసుకొని వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి నాలుగు సీట్ల భర్తీ విషయంలోనూ అదే ఫార్ములా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు
ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ సభ్యుడు సురేశ్ ప్రభు..వైసీపీకి చెందిన విజయ సాయిరెడ్డి..టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి.. టీజీ వేంకటేష్ పదవీ కాలం ముగియనుంది. ఇందులో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ముగ్గురికీ ఏపీ నుంచి మాత్రం అవకాశాలు లేవు. ఇక, విజయ సాయిరెడ్డి కి తిరిగి రెన్యువల్ చేయటం పైన అనేక చర్చలు జరుగుతున్నా..ఆయనకు తిరిగి పెద్దల సభకు కంటిన్యూ చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, మిగిలిన మూడు సీట్లలో మాత్రం జగన్ ఆచి తూచి ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా జగన్ సీఎం అయిన సమయం నుంచి బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు.

నెల్లూరు జిల్లా బీసీ నేతకు ఖాయం
గతంలో రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్... మోపిదేవి వెంకట రమణ ను రాజ్యసభకు పంపారు. వారి స్థానంలో మరో ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సారి రాజ్యసభకు నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన రావును రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన అనిల్ మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుంచి అనిల్ ను కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పారిశ్రామిక వేత్త..బీసీ వర్గానికి చెందిన బీదా మస్తాన రావు పేరు సైతం దాదాపు ఖాయమైందని పార్టీ లో ప్రచారం సాగుతోంది.

పక్కా సామాజిక సమీకరణాలతో
ఇక, మూడో స్థానం కోసం గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీల ఎంపిక సమయంలో ప్రతీ సారీ ఆయన పేరు పరిశీలనలో ఉన్నా..చివరి నిమిషంలో డ్రాప్ అవుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో ఆయనకు ఖాయమని భావించినా.. క్రిష్ణా - ప్రకాశం జిల్లాల నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వటంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో..ఆయన తాజాగా సీఎంతో సమావేశమయ్యారు. రాజ్యసభకు పంపే ప్రతిపాదన పైన ఆయనతో చర్చ సాగింది. దీని ద్వారా క్రిష్ణా - గుంటూరు జిల్లాల్లో టీడీపీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గానికి చెందిన ఆయనను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వస నీయ సమాచారం.

సీఎం జగన్ వ్యూహాత్మక ఎంపిక
దీని ద్వారా తాజాగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు..ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి... ఇప్పుడు రాజ్యసభకు పంపటం ద్వారా అమరావతి విషయంలో ఆ వర్గాన్ని సీఎం జగన్ టార్గెట్ చేసారనే విమర్శకు సమాధానం ఈ నిర్ణయాలు కౌంటర్ గా భావిస్తున్నారు. అయితే, గుంటూరు నుంచి ఇప్పటికే మోపిదేవి వెంకట రమణ.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరో స్థానం సైతం గుంటూరు జిల్లాకే ఇస్తారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. దీని పైన చివరి నిమిషంలో మార్పు జరిగితే ఆ స్థానంలో ఎస్సీ లేదా కాపు వర్గానికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇక, నాలుగో స్థానంలో అనూహ్యంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త పేరు ఖరారైందని సమాచారం. గతంలో ముఖేష్ అంబానీ స్వయంగా సీఎం జగన్ ఇంటికి వచ్చి తన సన్నిహితుడైన పరిమల్ నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని కోరారు.

పారిశ్రామిక దిగ్గజానికి ఇవ్వటం ద్వారా
అప్పట్లో బీజేపీ చాణక్యుడిగా చెప్పుకొనే కీలక నేత సూచన మేరకే ముఖేష్ అంబానీ స్వయంగా జగన్ వద్దకు వచ్చి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ గురించి చర్చించినట్లుగా అప్పట్లో ప్రచారం సాగింది. ముఖేష్ కోరిన విధంగానే సీఎం జగన్ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ కేటాయించారు. ఇక, ఇప్పుడు అంబానీతో వ్యాపార రంగంలో పోటీగా నిలిచే మరో దిగ్గజం ఆదానీ బద్రర్స్ లో ఒకరికి వైసీపీ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సీఎం అయిన తరువాత గౌతమ్ ఆదానీతో పలు మార్లు సమావేశాలు జరిగాయి. ఏపీలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక, రాజకీయంగానూ ఆదానీ బ్రదర్స్ నుంచి ఒకరి పేరు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా భవిష్యత్ లో ఏపీలో పెట్టబడులు.. జాతీయ స్థాయి సంబంధాలను బలోపేతం చేసుకొనేందుకు రాజ్యసభకు వారు అడిగిన వెంటనే జగన్ సానుకూలంగా స్పందించారనేది పార్టీ నేతల సమాచారం. దీంతో.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా..ఈ నలుగురికి వైసీపీ నుంచి రాజ్యసభ అవకాశం ఖాయమని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications