నేను స్నేహితుడ్ని అని చెప్పడం కాదు: హోదా ఇబ్బందిపై రాజ్నాథ్కు బాబు కౌంటర్
అమరావతి: కేంద్ర హోంశాఖ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా ఏపీకి ఇచ్చిన వాటిని రాజ్నాథ్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే తనను మంచి మిత్రుడు అని చెప్పడంపై కూడా బాబు స్పందించారు. మంచి మిత్రుడు అని చెప్పుకోవడం కాదని, ఏపీకి ఏం చేశారో రాజ్నాథ్ చెప్పి ఉండాల్సిందన్నారు.
కేంద్రం పాతపాట పాడుతోందే తప్ప ఏపీకి ఏం చేసిందో స్పష్టంగా చెప్పలేదన్నారు. రాష్ట్రానికి ఏం చేశారన్న దానిపై కేంద్రం పునఃసమీక్ష చేసినట్లుగా కనిపించలేదన్నారు. కేంద్రమంత్రులు వాస్తవాలు చెప్పేవరకు గట్టిగా నిలదీయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. కేంద్రమంత్రుల మాటల్లో నిజాయితీ లేదన్నారు.
ఈ వ్యర్థ ప్రసంగాలేంటి, సీఎంకు ఇన్నేళ్లు పట్టిందా: గల్లా ప్రసంగంపై పవన్
నవ్యాంధ్రకు కేంద్రం ఏం చేసిందో కచ్చితంగా చెప్పే వరకు వదిలేది లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజ్నాథ్ చెప్పినవే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అవే చెప్పే అవకాశముందని చెప్పారు. తనను మంచి స్నేహితుడిగా చెప్పడం కంటే ఏం చేశామో చెప్పాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. ఏపీకి ఎవరైతే అన్యాయం చేశారో వారిని శత్రువులా భావిస్తామని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తాము రాజీలేని పోరాటే చేస్తున్నామన్నారు..
ఏపీకి హోదా ఇవ్వడంలో ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ శుక్రవారం చెప్పారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ సమయంలో ఏపీకి ఇచ్చిన అంశాలపై మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను చాలా వాటిని ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. హోదాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి సాయం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఒక రాష్ట్రం అభివృద్ధికి ఏం చేయగలమో అంతకుమించి చేశామని చెప్పారు.
చంద్రబాబు మిత్రుడని వ్యాఖ్య
పార్టీలకు అతీతంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తమకు మిత్రుడేనని రాజ్నాథ్ చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రూ.1500 కోట్లు ఇచ్చామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చామని, ఇంకా అవసరం అనుకుంటే ఇస్తామని చెప్పారు. ఎన్డీయే నుంచి వెళ్లినా చంద్రబాబు మిత్రుడే అన్నారు. ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేస్తామన్నారు.
ఎన్నో హామీలు అమలు చేశాం
విభజన చట్టంలోని చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామని రాజ్నాథ్ అన్నారు. గుంటూరు - విజయవాడకు రూ.1000 కోట్లు ఇచ్చామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 6750 కోట్లు ఇచ్చామన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. 14వ ఫైనాన్స్ కమిషన్లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు రూ.1050 కోట్లు ఇచ్చామని, ఇంకా ఇస్తామని చెప్పారు.
ఇవి కూడా ఇచ్చాం..
2014-15 ఆర్థిక లోటు కింద రూ.4117 కోట్లు ఇచ్చామని రాజ్నాథ్ చెప్పారు. 2018 నాటికి రెవెన్యూ లోటు కింద రూ.18వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. విభజన చట్టంలోని చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీకి 2020 వరకు రూ.22,113 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని చెప్పిందని, కానీ 2018 నాటికే చాలా దాదాపు రూ.18వేల కోట్ల దాకా ఇచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు 42 శాతం వాటాలో భాగంగా 2020 నాటికి ఏపీకి రూ.2 లక్షల 6వేల 900 కోట్లు అందుతాయన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సాధారణ రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రాలు అని ఉండవని చెప్పారు.