అదే చేస్తే.. మండలిలో వైసీపీకి మెజారిటీ రావడం ఎంతసేపు..: అంబటి కీలక వ్యాఖ్యలు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిబంధనలకు విరుద్దంగా మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరు
దుష్ట సంప్రాదాయానికి తెరలేపిందన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. మహా అయితే కొన్నాళ్ల పాటు వాయిదా వేయించడం తప్ప ఏమీ చేయలేరన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ వెనక్కి తగ్గబోదని,టీడీపీ దుశ్చర్యలపై మేదావులు,ప్రజలు ఆలోచించాలని అంబటి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తమ పార్టీ తలుచుకుంటే మండలిలో మెజారిటీ రావడం ఎంతసేపు అని వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంబటి మాట్లాడారు.

అలా చేస్తే మండలిల మెజారిటీ ఎంతసేపు..
ఒకవేళ వైసీపీ గనుక వక్ర మార్గంలో వెళ్లాలనుకంటే.. మండలిలో మెజారిటీ సాధించడం ఎంతసేపు అని అంబటి వ్యాఖ్యానించారు. అయితే అలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ విధానం కాదు గనుకనే గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మండలిలో మెజారిటీ లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించారని,కానీ తాము అలా చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. రైతులకు తాను ఒక్కటే మనవి చేస్తున్నానని.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదవద్దని చెప్పారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న నిర్ణయం ఏ మార్పుకు సంకేతం కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పో ఒప్పో నిర్ణయించాల్సింది ప్రజలని, మండలి ఛైర్మనో.. చంద్రబాబో కాదని అన్నారు.

చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే..
మండలి ఛైర్మన్ షరీఫ్ను చంద్రబాబు ప్రభావితం చేశారని అంబటి ఆరోపించారు. గ్యాలరీలో షరీఫ్కు ఎదురుగా కూర్చొని.. తాను చెప్పినట్టు చేయాలన్న సంకేతాలిచ్చారని అన్నారు. తాను పదవి ఇచ్చాను కాబట్టి.. క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీకి మేలు చేసేలా నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవాలని చంద్రబాబు ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వ నిర్ణయాలను ఎంతకాలం ఆపగలుగుతారని ప్రశ్నించారు. ఏది ఏమైనా సెక్రటేరియట్ను వైజాగ్కు తరలించడం ఖాయమన్నారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే..
నిజానికి సీఎం జగన్ అసెంబ్లీ సెషన్ ఒకటి విశాఖలో పెట్టాలనుకున్నారని.. కానీ తమ సూచనల మేరకు కన్విన్స్ అయ్యారని అంబటి అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల చట్టం తీసుకొచ్చామన్నారు. ఒకవేళ తమ నిర్ణయం ప్రజలకు నచ్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో వారే వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ టీడీపీ చర్యలను ఖండించాలని కోరారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఆయన పార్టీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేశారని అన్నారు.

తాగి వచ్చామనడం సరికాదు..
మండలి సభ చట్ట ప్రకారం జరగాలని మంత్రులు ఒత్తిడి తెచ్చారని, అది తప్పా అని అంబటి ప్రశ్నించారు. నిబంధనల గురించి మాట్లాడితే.. ఛైర్మన్ షరీఫ్ తమ నేతలపై లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాగి సభకు వచ్చారని ఎలా అంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నవారైన షరీఫ్ ఇలా మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన చర్యలతో మరోసారి అమరావతి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతుందనకుంటే.. ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరపాలని,సలహాలు సూచనలు చేయాలని చెప్పారు. అంతే తప్ప ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు సరికాదన్నారు. రైతులు చంద్రబాబు కుయుక్తులు,మోసాలను గమనించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications