"మద్యాంధ్రప్రదేశ్.. చంద్రబాబుకు లిక్కర్ షాపుల ముడుపులు"
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తరిస్తోన్న మద్యం షాపుల గురించి ప్రస్తావిస్తూ.. మద్యం ఉత్పత్తిని పెంచే యోచనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని దుయ్యబట్టారు వైసీపీ నేత పద్మ వాసిరెడ్డి. చంద్రబాబు హయాంలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్ గా మారిపోతుందని ఆరోపణలు చేశారు.
ఖజానా నింపుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు.. రాష్ట్రంలో అదనపు మద్యాన్ని ఉత్పత్తి చేయాలని ఆలోచించడం దారుణమన్నారు. చంద్రబాబుకు మద్యంపై ఉన్న విజన్ లో కాస్తయినా మంచినీటిపై ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో అభివృద్ధి రేటు ఎక్కువగానే ఉన్నప్పుడు అదనపు మద్యాన్ని ఉత్పత్తి చేసి పేదవారి జీవితాలతో చెలగాటమాడుకోవడమెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం అవినీతి, క్రైమ్ విషయంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
లిక్కర్ షాపుల నుంచి ప్రతీ నెలా ముడుతున్న ముడుపులు చంద్రబాబుకు కోర్ డ్యాష్ బోర్డులో కనిపించడం లేదా అని ప్రశ్నించారు వాసిరెడ్డి పద్మ. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపులను ఇష్టారీతిన విస్తరించుకుంటూ పోతున్నారని ఆరోపించారు. వీలైతే మద్యంపై నియంత్రణ తీసుకురావాల్సిందిపోయి మరిన్ని మద్యం షాపులు పెట్టిస్తామన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా వాసిరెడ్డి పద్మ ఈ వ్యాఖ్యలు చేశారు.