రఘురామ అనర్హతపై తొలి అడుగు - స్పీకర్ కీలక నిర్ణయం : కౌంటర్ ప్లాన్ తో ఎంపీ రె"ఢీ"..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనర్హత వ్యవహారంలో తొలి అడుగు పడింది. ఇప్పటికే పలు మార్లు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు రఘురామ పైన అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. పార్టీ గుర్తు పైన ఎంపీగా గెలిచి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్లమెంటరీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఆ తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి.. లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి.. విప్ మార్గాని భరత్ పలు ఆధారాలు సమర్పించారు.

ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వాలంటూ
అయితే, కొద్ది నెలల క్రితం రఘురామ పైన వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసినట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా వైసీపీ విప్.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని...పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ..ఆధారాలు సమర్పించారు. దీని పైన స్పందించిన లోక్ సభ స్పీకర్ తాజాగా ఈ పిటీషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీని పైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే, ఇప్పటికే ఇదే వ్యవహారం పైన వైసీపీ నేతలు పలు సందర్భాల్లో రఘురామ పైన అనర్హత వేటు ఖాయమంటూ చెప్పుకొచ్చారు. దీనిని రఘురామ రాజు సవాల్ గా తీసుకున్నారు.

రఘురామ రాజీనామా దిశగా
వైసీపీ నేతలు ఎప్పటి లోగా వేటు వేయించగలరో చెప్పాలంటూ ఛాలెంజ్ చేసారు. వైసీపీ నేతలు రఘురామ వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా రంటూ తమ ఫిర్యాదులో ఆధారాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, రఘురామ మాత్రం తాను జరుగుతున్న లోపాలను ప్రస్తావించటం మినహా.. ఏ పార్టీలోనూ చేరలేదని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన లేదంటూ చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా..రఘురామ ఇదే అంశం పైన డెడ్ లైన్ విధించారు. ఈ నెల31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ లోగా తన పైన అనర్హత వేటు వేయించాలని సవాల్ చేసారు. ఆ తరువాత తానే రాజీనామా చేసి నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

ఉప ఎన్నికల్లో గెలుస్తానంటూ - ఏ పార్టీ నుంచి పోటీ
అమరావతి అజెండాగా తాను తన నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఎన్నికల్లో గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేసారు. తన గెలుపు ఖాయమంటూ.. మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 60 శాతం మంతి తన నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతుగా నిలిచినట్లుగా తేలిందని వివరించారు. దీంతో..తాను రాజీనామా చేయబోతున్నట్లుగా ఈ మధ్య కాలంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ నివేదిక కోరుతూ పిటీషన్ పంపినా..ఆ నివేదిక వచ్చే లోగానే రాజీనామా చేయాలనేది రఘురామ ఆలోచనగా తెలుస్తోంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం అసలు రఘురామ రాజీనామా చేయాలి కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా .. అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని రఘురామ అభ్యర్ధిస్తున్నారు.
Recommended Video

వైసీసీ సిద్దమేనా.. వేగంగా మారుతున్న పరిణామాలు
అయితే, ఆయన రాజీనామా చేస్తే.. స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగుతారా ...లేక, జనసే నుంచి బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఉప ఎన్నికలో ఓపెన్ గా మద్దతు ఇవ్వలేదు.
అదే స్వతంత్ర అభ్యర్ధిగా లేదా.. జనసేన నుంచి పోటీ చేస్తే అందరి సహకారం దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో..రఘురామ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నిక మారనుంది. ఇక, ఇప్పుడు, స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పిటీషన్ పంపి నివేదిక కోరటం... పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం... రఘురామ చెప్పిన ఫిబ్రవరి 5 దగ్గర పడుతుండటంతో.. మొత్తంగా రఘురామ రాజు ఎపిసోడ్ లో ఏం జరుగనుంది... వైసీపీ ఎలాంటి ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications