వాటెన్ ఐడియా సర్జీ... ''దసపల్లా'' కోసం దీర్ఘకాలిక వ్యూహం?
ప్రభుత్వ భూములపై కన్నేసే ఆక్రమణ దారులు తమ వ్యూహాన్ని దీర్ఘకాలికంగా అమలు చేస్తుంటారు. ఆ భూమిని సొంతం చేసుకునేందుకు ఓపికగా ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తారు. రాజకీయ నేతలు, అధికారులను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎవరైనా అడ్డుపడుతున్నారంటే ఆ పనిని కొంతకాలం వాయిదా వేస్తారు. తమ పని అవడంలేదు.. వేరే అధికారి వస్తే అవుతుంది అనుకున్నప్పుడు తమకు కావల్సినవారిని ఆ పోస్టులోకి తెప్పించుకుంటారు. విశాఖపట్నంలో దసపల్లా భూముల కోసం ఆక్రమణదారులు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఏ భూముల విషయంలోనైనా టైటిల్ డీడ్ ముఖ్యం.
వాస్తవానికి ప్రభుత్వాలు మొదటి నుంచి దసపల్లా భూములకు సంబంధించి దస్త్రాలను సరైనరీతిలో తయారుచేయలేదు. న్యాయస్థానాల్లో పటిష్టమైన వాదనలు వినిపించలేదు. కేవలం ఈ కారణంవల్లే ఆ భూములకు సంబంధించిన తీర్పులు ప్రయివేటు వ్యక్తులకు అనుకూలంగా వచ్చాయని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, దస్త్రాలు క్షుణ్నంగా పరిశీలించి మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే ప్రభుత్వానికే విజయం లభిస్తుందన్నారు. టీటీడీ తరఫున భూముల్లోను గతంలో ఇలాగే జరిగిందని, మొదటి నుంచి మళ్లీ కేసు నడిపించిన తర్వాత అనుకూలంగా తీర్పు వచ్చిందనే విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ శివార్లలోని భూములకు సంబంధించి సినీరంగానికి సంబంధించిన వారికి అనుకూలంగా తీర్పు వచ్చింని వెల్లడించారు. ఆ పత్రాలు దొంగ పత్రాలని, భూమిపై హక్కు ఉండదని న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ వేస్తోందని, ఏపీ ప్రభుత్వం కూడా అలాగే చేయవచ్చని సూచించారు.