విశాఖలో పవన్ గో బ్యాక్ నినాదాలు - జనసేన వర్సెస్ ఉత్తరాంధ్ర జేఏసీ..!!
విశాఖ నగరంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. పవన్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆందోళనలకు దిగింది. విశాఖ గర్జన తరువాత నగరంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అదే సమయంలో విమానాశ్రయం వద్ద మంత్రుల కార్ల పైన దాడి చేయటంతో పరిస్థితి మారి పోయింది. ఈ ఘటనకు సంబంధించి విశాఖ విమానాశ్రయం వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసు అధికారులు పరిశీలించారు. పలువురు జనసేన నేతలను అరెస్ట్ చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్లో పోలీసులు తనిఖీలు చేసారు.
భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు జరిగాయని చెబుతున్నారు. అక్కడే విమానాశ్రయం వద్ద దాడి కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. దీని పైన స్పందించిన పవన్.. వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. తాను స్టేషక్ కు వచ్చి సంఘీభావం ప్రకటిస్తానంటూ ట్వీట్ చేసారు. అటు విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అక్కడ జరిగిన ఘనటలో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటుగా కొందరికి గాయాలు అయినట్లు చెబుతున్నారు. కొందరు ప్రయాణీకులకు విమానాలు మిస్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో జనసేనాని కాసేపట్లో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని కోసం కళావాణి అడిటోరియం కి వినతులు తీసుకుని ప్రజలు వస్తున్నారు. శనివారం విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వైసీపీ నుంచి స్పందన ఉండే అవకాశం ఉండటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ నుంచి జనవాణి కార్యక్రమం జరిగే కళావాణి ఆడిటోరియం వరకు సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. అటు జనసైనికుల దాడి పైన మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జేఏసీ సభ్యులు పవన్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ప్లకార్డుల తో నిరసనకు దిగారు. మూడు రాజధానులకు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారంతా గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసారు. వారిని పోలీసులు అక్కడ నుంచి తరలించారు. పవన్ పాల్గొంటున్న కార్యక్రమం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.












Click it and Unblock the Notifications