కౌన్సెలింగ్కు వెళ్లొద్దు: టీ విద్యార్థులకు జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్తో తెలంగాణకు ఏ విధమైన సంబంధం లేదని రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనరని, ఇక్కడి కాలేజీలు పాలు పంచుకోవని చెప్పారు. కౌన్సెలింగ్ గురించి తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
మన కౌన్సెలింగ్ మనమే చేసుకుందామని తెలంగాణ విద్యార్థులకు బుధవారం రాత్రి ఆయన భరోసా ఇచ్చారు. జూలై 30న ఎంసెట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టు 7 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తామన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్రెడ్డి ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ఉన్నత విద్యామండలి నిర్ణయం ఏకపక్షమని ఆయన తప్పు పట్టారు. త్వరలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తమ ప్రతి రూపాయి, వనరులు తెలంగాణ వారికే చెందాలని ఆయన అన్నారు. తమ విద్యార్థులకు ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం తమ బాధ్యత అని, తమ ప్రాంతంలోని కాలేజీల్లో నియామకాలు చేసే అధికారం ఆంధ్రప్రదేశ్కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ సంస్థ, మరో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించలేవని ఆగ్రహంగా అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
ఏపీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేయడానికే అక్కడి సీఎం ప్రయత్నిస్తున్నారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులు బాగుపడకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణను తప్పుపడుతున్న ఏపీ సీఎం తన రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు కావాల్సిన అనుమతులు ఏవీ ఇవ్వనేలేదని మంత్రి జగదీశ్రెడ్డి ఆక్షేపించారు. తాము అడుక్కుతినాలని ఇలాంటి పనులు చేస్తున్నారా? దేశంలో కాందీశీకులంతా వస్తే తాము ఫీజులు కట్టాలా? అని మంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం చంద్రబాబు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. జంతువులు కూడా తమ పిల్లలను తామే సాకుతాయని, అంతకన్నా హీనంగా చంద్రబాబు ఏపీ పిల్లలకు తాము (తెలంగాణ) ఫీజులు చెల్లించాలని అడుగుతున్నారని ఆవేశంగా అన్నారు. కౌన్సెలింగ్పై ఏపీ సర్కారు కోర్టుకు వెళ్లిందన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ - కోర్టు ఏం చెబుతుందనేదే ముఖ్యమన్నారు. విభజన బిల్లులో ఉమ్మడి కౌన్సెలింగ్ అని ఉందిగా అని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చినప్పుడు - దాని అర్థం ఒక రాష్ట్రం ఏక పక్షంగా కౌన్సెలింగ్ చేసుకోవడం కాదన్నారు.












Click it and Unblock the Notifications