సాయిరెడ్డికి ఖాయం.. రెండో మంత్రి ఎవరంటే ..అమిత్ షాకు జగన్ జాబితా..!
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో మార్పు శరవేగంగా కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం ప్రధానితో భేటీ అయిన జగన్.. మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక శుక్రవారం రోజున సాయంత్రం అమిత్షాను ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర కేబినెట్లోకి వైసీపీ.. ?
ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. దాదాపు మూడునెలలగా సీఎం జగన్కు అప్పాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని కార్యాలయం రెండ్రోజుల క్రితం ఒక్కసారిగా గంటకు పైగా ప్రధాని మోడీతో అప్పాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో ఏపీ రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇక అదే సమయంలో వైసీపీ కేంద్ర కేబినెట్లో చేరుతోందనే వార్తలు కూడా ఢిల్లీ వర్గాల్లో షికారు చేశాయి. ఢిల్లీలో షికారు చేసే వార్తలకు శుక్రవారం జరగనున్న జగన్ అమిత్ షా భేటీ మరింత బలం చేకూరుస్తోంది. కేంద్ర కేబినెట్లో వైసీపీ చేరబోతుండటం దాదాపు ఖాయమైనట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

విజయ్ సాయిరెడ్డికి మంత్రి పదవి ఖాయం
ఏపీ సీఎం జగన్ శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర కేబినెట్లో మంత్రులుగా చేరబోయే వారి జాబితాను అమిత్ షా కు అందజేయనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదే విషయం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సన్నిహితుడు ఎంపీ విజయ్ సాయిరెడ్డికి కచ్చితంగా కేంద్రమంత్రి పదవి దక్కుతుందనే సమాచారం ఉండగా... రెండో మంత్రి పదవి కాపు లేదా ఎస్సీ సామాజిక వర్గంకు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గం కోటాలో ఎంపీ వంగా గీతా పేరు
కాపు సామాజిక వర్గం కోటాలో ఇవ్వాల్సి వస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీనియర్ నేత మహిళా ఎంపీ వంగా గీతాకు దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. ఒకవేళ ఎస్సీ కోటాలో ఇవ్వాల్సి వస్తే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మహిళకే రెండో మంత్రి పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఈక్వేషన్స్ చూస్తే అమలాపురం ఎంపీ చింతా అనూరాధ.. ఎస్టీ కోటాలో గొడ్డేటి మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక కేంద్రమంత్రి పదవి రేసులో బాలశౌరి సైతం ఉన్నట్లు సమాచారం.

రేసులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ
ఇక రాయలసీమ ప్రాంతానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే చిత్తూరు లేదా తిరుపతి ఎంపీలుగా ఉన్న ఎస్సీ వర్గానికి చెందిన బిల్లి దుర్గాప్రసాద రావు చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు చాన్స్ దక్కేలా కనిపిస్తున్నాయి. వైసీపీ వర్గాల సమాచారం మేరకు విజయ్ సాయిరెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి దక్కనుండగా... రెండో మంత్రి పదవికి వంగా గీత, బాలశౌరి పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరిక ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అమిత్ షా తో జగన్ భేటీ సమయంలో మూడు రాజధానులు..మండలి రద్దుతో పాటుగా కేబినెట్ లో చేరిక అంశం చర్చకు రానుందని సమాచారం. ఇక చంద్రబాబుకు పవన్ కళ్యాణ్లకు ఒకేసారి చెక్ పెట్టాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ స్కెచ్ వేశారని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications