చంద్రబాబు, రేవంత్ పై జగన్, కేసీఆర్ ఉమ్మడి వ్యూహం!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన పార్టీలు బిఆర్ఎస్ మరియు వైసిపి ఇప్పుడు ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నాయా? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకేలా ఆలోచిస్తున్నారా? రాష్ట్రంలో అధికార పార్టీ పైన తిరుగుబాటులో వీరిద్దరూ ఒకే పంధాలో ఉమ్మడి వ్యూహంతో వ్యవహరిస్తున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
జాతీయస్థాయి పోరాటానికి సై అంటున్న బీఆర్ఎస్
గతేడాది జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచక పాలన సాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పైన విరుచుకుపడుతున్న బిఆర్ఎస్ తాజాగా జాతీయ స్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రపతికి వినతిపత్రం.. జాతీయస్థాయిలో యుద్ధం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ఫిరాయింపులకు పాల్పడడం ద్వారా రాజ్యాంగ హననానికి పాల్పడడం, ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న ఘటనల పైన తమకు మద్దతిచ్చే జాతీయ పార్టీ నేతలతో కలిసి మాట్లాడటంతో పాటు, రాష్ట్రపతిని కూడా కలిసి వినతి పత్రాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తామని ప్రకటించింది.
జాతీయ స్థాయిలో చంద్రబాబుపై జగన్ గురి
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాలపైన గవర్నర్ కు వివరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాష్ట్రపతి వద్ద ఫిర్యాదులు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఏపీలో ఇటీవల ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే జాతీయ స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేయాలని నిర్ణయించారు.
చంద్రబాబు టార్గెట్ గా జగన్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ హత్యలు, రాజకీయ ప్రేరేపిత ఆత్మహత్యలు పెరిగిపోయాయని, 300 కు పైగా హత్యాయత్నాలు జరిగాయని, 1000 చోట్ల దాడులకు పాల్పడ్డారని, 36 రాజకీయ హత్యలు జరగగా, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న వైసిపి అధినేత జగన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు అరాచకాలు దేశానికి తెలిసేలా 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. అంతే కాదు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలో ఓటమిపాలైన రెండు పార్టీలు, పార్టీల అధినేతలు వైయస్ జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నారు.అధికార పార్టీలను ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications