స్టాలిన్..కేసీఆర్ మధ్యలో జగన్ : చంద్రబాబుకు చిర్రెత్తుతోంది : వేగంగా మారుతున్న సమీకరణాలు .
జాతీయ రాజకీయాల్లో తెలుగు పార్టీల అధినేతలు కీలకంగా మారుతున్నారు. జాతీయ స్థాయిలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. యుపిఏలో భాగస్వాములంటూ చంద్రబాబు కలిసిన పార్టీ నేతలనే ఇప్పుడు కేసీఆర్ కలుస్తున్నారు . తాజాగా, డిఎంకె అధినేత స్టాలిన్తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వెనుక అసలు సూత్రధాని వైసీపీ అధినేత జగన్ అని సమాచారం. తమ మిత్రులతో ప్రత్యక్షంగా కేసీఆర్..పరోక్షంగా జగన్ మంతనాలు సాగించటం టీడీపీ అధినేత చంద్రబాబుకు రుచించటం లేదు.
ఆ ఇద్దరూ ఒక్కటిగా..
జాతీయ రాజకీయాల్లో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెబుతుంటే ఆయనకు అవకాశం లేకుండా తామే కీలకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఇద్దరూ కలిస్తే 35 సీట్లు తమవేనని సర్వే నివేదికలు ఉండటంతో వీరి మాటకు ప్రాధాన్యత పెరుగుతోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రయత్నాలు చేసిన కేసీఆర్ తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తున్న వేళ మరోసారి యాక్టివ్ అయ్యారు. తాజాగా కుమార స్వామి, కేరళ ముఖ్యమంత్రి, ఇప్పుడు స్టాలిన్తో మంతనాలు చేస్తున్నారు. అయితే, స్టాలిన్తో కేసీఆర్ భేటీ వెనుక జగన్ ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఇదే సమయంలో ఉత్తరాదిన అఖిలేష్, మమతతో సైతం ఈ ఇద్దరు నేతలు టచ్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. నవీన్ పట్నాయక్ ఇప్పటి వరకు ఎవరికి మద్దతిస్తారో ప్రకటించలేదు. దీంతో..ఆయన సైతం తమతో కలుస్తారనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు.
చంద్రబాబుకు చెక్ పెట్టేందుకేనా..
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దక్షిణాదిన కుమార స్వామి, స్టాలిన్ యుపీఏ భాగస్వాములుగా వారితో కొద్ది కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ ఇద్దరూ ఖచ్చితంగా తమతోనే ఉంటారని..తాము చెప్పిన వారికే మద్దతు ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఫలితాలు వచ్చే ముందు ఆ ఇద్దరూ కూడా కేసీఆర్తో భేటీ అవటం చంద్రబాబుకు రుచించటం లేదు. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ రాకపోతే..ఇతర పార్టీలతో కలిసి ఫ్రంట్గా ఏర్పడి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటమో...లేక..కాంగ్రెస్ మద్దతుతో వీరే ప్రభుత్వంలో ఏర్పాటు చేయటమో అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇక, ఇప్పుడు దక్షిణాదిన కీలకమైన డిఎంకె అధినేతతో కేసీఆర్ భేటీ అయిన సమయంలో ఏరకమైన చర్చలు సాగాయి..స్టాలిన్ కాంగ్రెస్ను కాదని ఫెడరల్ ఫ్రంట్ వైపు వెళ్తారా అనే మీమాసం నెలకొని ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే కొద్ది రోజుల క్రితం కేసీఆర్కు చంద్రబాబు పరోక్ష స్నేహ హస్తం అందించారు.
నెంబర్ గేమ్లో జగన్ కంటే బాబు వెనుక..
ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని ఇప్పటి వరకు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేసాయి. దీంతో..అనుభవం..పరిచయాల కారణంగా చంద్రబాబుకు జాతీయ పార్టీల నేతలు సఖ్యతగా ఉంటున్నా..అధికారానికి కావాల్సిన నెంబర్ గేమ్లో మాత్రం చంద్రబాబు కంటే జగన్ ముందున్నారు. దీని కారణంగా జగన్తో ముందుగానే ఒప్పందాలు చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, జగన్ మాత్రం ఎక్కడా ఎవరికి మద్దతు ఇస్తానంటూ హామీ ఇవ్వటం లేదు. దీంతో..కేసీఆర్ ద్వారా జగన్ మద్దతు సైతం పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక, 23న ఫలితాల్లో అందరూ అంచనా వేస్తున్నట్లుగా హంగ్ పార్లమెంట్ వస్తే ఖచ్చితంగా కేసీఆర్.. జగన్ మాటకు విలువ మరింత పెరగనుంది.