తెలుగు రాష్ట్రాల్లో జగన్ పుట్టినరోజు వేడుకలు: టెక్కలిలో భారీ కేక్ కట్ చేసిన ఏపీ ప్రతిపక్షనేత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్... టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు జగన్కు ఆశీర్వచనం ఇచ్చి దీవించారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని అతనికి విషెస్ చెప్పేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు తండోపతండాలుగా టెక్కలికి తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది.
జగన్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఘనంగా నిర్వహిస్తోంది. విదేశాల్లో కూడా జగన్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక గతేడాది నుంచి జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర 327వ రోజుకు చేరుకుంది. దండుగోపాలపురం నుంచి మొదలైన పాదయాత్ర కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకు సాగనుంది.

పాదయాత్రలో ఉన్న జగన్ను పలువురు ప్రముఖలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్కు విషెస్ అందించిన వారిలో వైసీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మానా ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాంతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కళావతి, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఉన్నారు. ఇక ఏపీతో పాటు తెలంగాణలోని వైసీపీ కార్యాలయాల్లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది అభిమానులు జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications