"జగన్ కల నెరవేరదు!.. ఏపీకి సరైన సీఎం ఉన్నాడనే నీతి ఆయోగ్ నిధులు"
నిధులకు ఎలాంటి కొరత లేదని, ప్రాజెక్టు పనులన్ని నాణ్యతతో సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కావాలన్న జగన్ కల నెరవేరబోదని ఈ సందర్భంగా చంద్రబాబు ఎద్దేవా చేశారు
విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అడుగడుగునా అభివృద్దికి అడ్డుపడుతున్నారని అధికార టీడీపీ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఈ ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కనీసం 20నుంచి 30ఏళ్ల పాటు సాగదీయాలన్నది వైసీపీ అధినేత జగన్ ఆశయమని మండిపడ్డారు.
ఆ కారణంతోనే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గురువారం ఉదయం కాపర్ డ్యామ్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోను పోలవరం తమ హయాంలోనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులంతా సంసిద్దంగా ఉన్నారని అన్నారు.
నిధులకు ఎలాంటి కొరత లేదని, ప్రాజెక్టు పనులన్ని నాణ్యతతో సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కావాలన్న జగన్ కల నెరవేరబోదని ఈ సందర్భంగా చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'పోలవరంతో ఏపీ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి, సరైన వ్యక్తి సీఎంగా ఉన్నారన్న ఆలోచనతోనే' నీతి ఆయోగ్ నిధులిచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా చూసుకుంటామన్నారు.