జగన్ గెలుపు ఫార్ములా రెడీ -సెంటిమెంట్ అస్త్రం : టీడీపీ మూలాల మీద దెబ్బ కొట్టేలా..!!
ఏపీలో అధికారం నిలబెట్టుకోవటమే ఇప్పుడు సీఎం జగన్ లక్ష్యం. ప్లీనరీ వేదికగా 175 సీట్ల గెలుపు అసాధ్యం కాదు..సుసాధ్యమే అని స్పష్టం చేసారు. ఎన్నికలకు సిద్దం కండంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన ఓట్ బ్యాంకు ఏంటో క్లారిటీ ఇచ్చారు. తన పాలనలో ప్రతీ ఇంటికి మేలు - మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలంటూ సెంటిమెంట్ అస్త్రం సంధించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకొనే క్రమంలో..ముందుగానే తనకు మద్దతు ఇచ్చేందుకు ఓటర్లు ఫిక్స్ అయ్యేలా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు.
ఇక..టీడీపీ మూలాలను దెబ్బ తీసే విధంగా జగన్ కొత్త నినాదాలు తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత మీద దెబ్బ కొడుతున్నారు. పథకాల లబ్దిదారు పైన సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు.
ఓటర్లతో ఎమోషనల్ అటాచ్ మెంట్
దీంతో.. పూర్తిగా ముందుగానే ఓటర్లను మానసికంగా తన వైపే ఉన్నారనే భావన కలిగించేలా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ ప్రసంగం వెనుక భారీ వ్యూహమే దాగి ఉంది. ఎన్నికల్లో తన ఓటు బ్యాంకును మరింత పటిష్ఠం చేసుకొనే విధంగా పక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
అందులో భాగంగా.. టీడీపీ పెత్తందార్ల పార్టీ అంటూ... మధ్య తరగతి - పేద ప్రజల నుంచి టీడీపీని దూరం చేసే వ్యూహానికి జగన్ తెర తీసారు. టీడీపీ నేతలు పదే పదే తమది పేదల పార్టీ అని ప్రచారం చేసుకుంటున్న వేళ.. తన పథకాల అమలుతో పాటుగా.. తన పేద పిల్లలకు ఆంగ్ల విద్యాబోధన- ఇంటి స్థలాల విషయంలో టీడీపీ అడ్డుపడుతుందని చెబుతూ..టీడీపీ పెత్తందార్ల కోసం.. పెత్తందార్లతో నడుస్తున్న పార్టీగా అభివర్ణించారు. దీని ద్వారా టీడీపీ ధనికుల పార్టీ.. తాను పేదల పక్షాన నిలబడిన నేతగా చెప్పుకొనే ప్రయత్నం చేసారు.
చంద్రబాబు విశ్వసనీయపై దెబ్బ కొడుతూ
ఇక, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని చెప్పటం ద్వారా..తన లక్ష్యాన్ని సీఎం జగన్ స్పష్టం చేసారు. ప్రతీ పథకంలో లక్షల మంది లబ్ది దారులు.. వారి కుటుంబాల ఓట్ల లెక్కలతో జగన్ వారంతా తన వైపే నిలబెట్టుకొనేలా సెంటిమెంట్ అస్త్రం సంధించారు. పథకాలు అందితేనే.. జగన్ చెప్పంది చేశాడని నమ్మితేనే తనకు ఓటు వేసి ఆశీర్వదించాలంటూ ఎన్నికల ప్రచారం ప్లీనరీ వేదికగానే ప్రారంభించారు.
అదే సమయంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. విస్మరించిన తీరును ఇప్పటికీ జగన్ ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు..పాదయాత్రలోనూ ఇవే చెప్పారు. ఇప్పడూ చెప్పటం ద్వారా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీయటం వ్యూహం. అందులో 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాను అమలు చేసి చూపించానని.. చంద్రబాబు చేయని వైనాన్ని ప్రజల ముందు ఉంచటం దీని వెనుక లక్ష్యం. దీని ద్వారా.. ఇప్పుడు జగన్ పథకాలను చంద్రబాబు తాను అమలు చేస్తానని చెప్పినా.. లబ్దిదారులు నమ్మకుండా ఉంచేలా ముందు నుంచే సీఎం జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు.
సెంటిమెంట్ పండిస్తూ.. గెలుపు కోసం
పథకాలు నిలిచిపోయేలా కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేస్తూ..లబ్దిదారుల్లో చంద్రబాబు అండ్ టీం పైన వ్యతిరేకత పెంచటం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక, సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ వర్గాలను పూర్తిగా తన వైపు తిప్పుకొనే ప్రయత్నాలు జగన్ కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో తొలి మూడేళ్ల వరకూ ఎస్టీ- మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పథకాల లబ్దిదారులే తన సైన్యమని..పార్టీ శ్రేణులు- అభిమానులు - ప్రజా మద్దతే తన బలమని చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో వారందరి మద్దతుతో తిరిగి గెలిచే విధంగా జగన్ ప్లీనరీ వేదికగా తన వ్యూహాన్ని స్పష్టం చేసారు.
అయితే, ప్రతీ పథకంలోనూ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ది దారుల మద్దతు నిలబెట్టుకోవటం జగన్ తొలి లక్ష్యం. సామాజిక వర్గాల వారీగా మద్దతు నిలబెట్టుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. మరి.. సీఎం జగన్ తన వ్యూహం - లక్ష్యం స్పష్టం కావటంతో..ఇవి రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయటానికి ఏ మేర సహకరిస్తాయనేది వేచి చూడాల్సిందే.