తెలంగాణకు వైయస్ జగన్ పరిష్కారం: వదిలేయాలి
హైదరాబాద్: తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరిష్కారం చూపించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణను అభివృద్ది చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర డిమాండ్తో ఆయన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ఎకనమిక్ టైమ్స్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
తాను తెలంగాణ ప్రజలను కలుస్తానని, తెలంగాణ అభివృద్ధికి ఏం చేయాలో అది చేస్తానని హామీ ఇస్తానని ఆయన అన్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉండదని, పరిష్కారాలు లభించిన అంశాలను యథాతథంగా వదిలేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని స్పృశించకపోవడం మంచిదని జగన్ అన్నారు.
ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ చెప్పడం వల్ల ఉపసంహరించుకున్నప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదని ఆయన అన్నారు. విభజన నిర్ణయం మంత్రి వర్గం ఆమోద దశలోనే ఉందని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ మనోభావాలతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికే సోనియా గాంధీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన ఈ నెల 5వ తేదీన విమర్శించారు.