జగన్ కాన్ఫిడెన్స్ పెరిగిందట..! కొత్త చేరికతో వైసీపీకి బూస్టింగ్
ఏ నేత ఎప్పుడు షాక్ ఇస్తాడో తెలియక.. పార్టీ గోడ దూకే నేతలకు బ్రేకులు వేయలేక సతమతమవుతున్న ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ఇదో ఊరట కలిగించే అంశమే. వరుసపెట్టి పార్టీకి గుడ్ బై చెప్పిన నేతల సంఖ్య ఇప్పటివరకు 17 కు చేరుకోగా.. టీడీపీ ఆకర్ష్ మంత్రానికి రాబోయే రోజుల్లోను ఈ వలసలకు ఫుల్ స్టాప్ పడేది లేనిది అనుమానమే. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా జరిగిన ఓ చేరిక పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోంది.
కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇచ్చిన తరుణంలో, అదే జిల్లా నుంచి పార్టీలోకి కొత్త చేరిక జరగడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీని వీడి తెలుగుదేశం తరుపున ఎన్నికల బరిలో దిగిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై, కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఫిరాయింపులతో ఢీలా పడ్డ వైసీపీకి మురళీకృష్ణ చేరిక కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అభిప్రాయ పడుతున్నారు పార్టీకి చెందిన పలువురు. స్వయంగా అధినేత జగన్ మురళీకృష్ణకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం ఫిరాయింపులకు ఎంతవరకు బ్రేక్ వేస్తుందో తెలియదు గాని అధినేత జగన్ కు మాత్రం ఈ చేరిక ఆత్మ విశ్వాసాన్ని కలిగించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.