తెలంగాణాకు ఎల్ నినో తీవ్ర హెచ్చరిక... తాగునీటికి డేంజర్ బెల్స్!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముఖం చాటేశాయి. సాధారణం కంటే అతి తక్కువ వర్షాలు నమోదు అవుతున్నాయి. అనేక జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం వలన రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోవడం, భూగర్భ నీటిమట్టం తగ్గిపోవడం భవిష్యత్తులో తాగునీటి కష్టాలు వస్తాయి అన్న సంకేతాన్ని ఇస్తుంది.
రాష్ట్రంలో జలాశయాల్లో నీటి సామర్ధ్యం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలు ఆధారంగా ఉన్నాయి. అయితే. ఈ 29 జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 1059 టిఎంసిలు కాగా, ప్రస్తుతం కేవలం 333.44టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఆందోళన కొనసాగుతోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ పరిస్థితి భవిష్యత్తులో నీటి కష్టాలకు కారణంగా కనిపిస్తోంది.

ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరం
ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ పైన వినియోగించుకోదగిన నీరు కేవలం మూడు టీఎంసీల నీరు మిగిలి ఉండగా, ప్రతినెల తాగునీటి అవసరాలకు సుమారు అర టీఎంసీ నీరు అవసరం అవుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జలాశయాలలోనూ నీటి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది.
ప్రమాదకరంగా జలాశయాలలో నీటిస్థాయిలు
నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూరు, కోయిల్ సాగర్, రామన్ పాడు, ఎల్లంపల్లి, కడెం, జూరాల, అక్కంపల్లి, వైరా, ఉదయ సముద్రం, ధర్మసాగర్, వంటి జలాశయాలలో నీటి స్థాయిలు ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జలాశయాల పైన ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నిల్వలతో సెప్టెంబర్ చివరి వరకు తాగునీరు అందించే అవకాశం ఉంది.
9.46 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలమట్టం
ఈలోపు వర్షాలు పడితేనే కాస్త భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చకుండా ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల కారణంగా జూన్ నాటికి రాష్ట్ర భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతుకు పడిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని బోర్లను మరింత లోతుగా తప్పడం, అవసరమైన చోట కొత్త బోర్ లను ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని సంరక్షించడం వంటి చర్యలను చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఏదేమైనా ప్రస్తుత వర్షాభావ పరిస్థితి ముందు ముందు తెలంగాణ రాష్ట్రం నీటి సంక్షోభం ఎదుర్కోబోతోంది అన్న సంకేతం ఇస్తోంది.












Click it and Unblock the Notifications