నిమ్మగడ్డ స్పెషల్ ఆఫీసర్కు జగన్ సర్కార్ ప్రమోషన్- ఏడీజీగా మారిన ఐజీ సంజయ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు అనీ శుభసూచికలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కోరుకున్న విధంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఎన్నికలకు సహకరించేందుకు ఏడాదిగా పంతంగా ఉన్న వైసీపీ సర్కారు కూడా సై అనేసింది. ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాల నియంత్రణకు ఆయన నియమించుకున్న ఐజీ స్ధాయి అధికారికి సర్కారు ప్రమోషన్ కూడా ఇచ్చింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా బలవంతపు ఏకగ్రీవాలు నియంత్రించేందుకు ఐజీ స్ధాయి అధికారి అయిన ఎన్.సంజయ్ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు. ఆయన నిన్న నిమ్మగడ్డను కలిసి బాధ్యతలు కూడా స్వీకరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల అడ్డుకట్ట కోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన్ను ఐజీ నుంచి అదనపు డీజీగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఆయనకు డబుల్ ప్రమోషన్ లభించినట్లయింది.

1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్తో పాటు ఆయన బ్యాచ్కు చెందిన మరికొందరు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పిస్తూ ఇవాళ సర్కారు జీవో ఇచ్చింది. దీని ప్రకారం సంజయ్తో పాటు ఐపీఎస్లు శంకబ్రత బాగ్చీ, భావనా సక్సేనా కూడా ఏడీజీలుగా పదోన్నతి పొందారు. ఈ ముగ్గురికీ ఏడీజీలుగా సూపర్ టైమ్ స్కేల్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఐజీ స్ధాయి అధికారి కోరుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు అంతకంటే సీనియర్ హోదా అయిన ఏడీజీ స్ధాయి అధికారి లభించినట్లయింది.












Click it and Unblock the Notifications