బైజూస్ తో జగన్ సర్కార్ కీలక ఒప్పందం- 4-8 తరగతుల పిల్లలకు ట్యాబ్ లు-అంతా యాప్ లోనే
ఏపీలో పాఠశాల విద్యార్దులకు నాణ్యమైన విద్య అందించే దిశగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది.ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమం చేపడుతోంది. అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ 'బైజూస్'తో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధుల సంతకాలు చేశారు. దీంతో కొందరికే పరిమితమైన ఎడ్యు-టెక్ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పేదపిల్లలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
బైజూస్ తో ఏపీ సర్కార్ ఒప్పందం
ఏపీలో విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇవాళ మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా ప్రస్దిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్'తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్కుమార్, బైజూస్ వైస్ ప్రెశిడెంట్, పబ్లిక్పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్' వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ అమెరికా నుంచి పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్దులకు స్కూళ్లలోనే ట్యాబ్ ఆధారిత విద్య లభించనుంది.
దావోస్ టూర్ లో అడుగులు
సీఎం జగన్ తాాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్కడే బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ- లెర్నింగ్కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్ చెప్పారు. ఈ చర్చల ఫలితంగా.. ఇవాళ బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.
విద్యార్ధులకు ప్రయోజనాలివే
ఇవాళ బైజూస్ తో కుదిరిన ఒప్పందంతో ఇప్పటివరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విద్య ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. ఏడాదికి కనీసం రూ.20వేల నుంచి రూ.24వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్' ఇ- తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ చదుపుతున్న 32 లక్షలమంది పిల్లలకు ఈ బైజూస్ యాప్ తో ప్రయోజనం ఉంటుంది.
2025 నాటి పదోతరగతి విద్యార్థులు, అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాస్తారు. వీరిని సన్నద్ధంచేసేందకు వీలుగా ఈ యాప్తోపాటు అదనంగా ఇంగ్లిషు లెర్నింగ్యాప్కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. నేర్చుకోవడానికి వీరికి ట్యాబ్కూడా సమకూర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల లబ్ధి పొందనున్నారు. బైజూస్లో లెర్నింగ్యాప్లో బోధన అంతా అత్యంత నాణ్యంగా ఉంటుంది.
యానిమేషన్ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్నంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీకూడా ఇటు ఇంగ్లిషులోనూ, ఇటు తెలుగు మాధ్యంలోనూ కూడా అందుబాటులో ఉంటాయి. ద్విభాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషాపరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
Recommended Video
గేమ్ ఛేంజర్ అన్న జగన్
బైజూస్ తో కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర విద్యారంగంలో గేమ్ ఛేంజర్ కానుందని సీఎం జగన్ తెలిపారు.పేదపిల్లల జీవితాలను ఇది మారుస్తుందన్నారు. ఈ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం కావడం అన్నది చాలా గొప్ప ఆలోచన అన్నారు. మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం అన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన ఉద్దేశమన్నారు.
పదోతరగతిలో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుందన్నారు. బైజూస్ ద్వారా అందే నాణ్యమైన కంటెంట్, పిల్లలకు సులభంగా అర్థంఅయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్ ప్రభుత్వ స్కూళ్లలో4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తున్నామని జగన్ వెల్లడించారు.