పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు జగన్ సర్కార్-హౌస్ మోషన్ పిటిషన్-సోమవారం విచారణ
ఏపీలో కరోనా పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హౌస్మోషన్ లో పిటిషన్పై విచారణ జరిగింది. సోమవారం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు స్పష్టం చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం పంపిన అధికారులతో సంప్రదింపులు జరిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్... జనవరి 23 నుంచి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది.. అదే సమయంలో ఉద్యోగులతో కూడా ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయిస్తోంది.

ఇవాళ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం కరోనా పరిస్ధితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. దీనిపై హైకోర్టు సోమవారం నుంచి విచారణ జరపనుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల్లో అమలయ్యే పథకాలపై నిర్ణయాలు తీసుకోవద్దని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రభుత్వానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications