హైకోర్టులో ఏపీ సర్కార్ మెమో-మూడు రాజధానులు వెనక్కి తీసుకున్నాం-సోమవారం కీలక నిర్ణయం
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని వైసీపీ సర్కార్ తాజాగా వెనక్కి తీసుకుంది వాటి స్ధానంలో సమగ్రంగా మరో బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే అప్పటికే హైకోర్టులో ఈ బిల్లుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతున్న నేపథ్యంలో హైకోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో మెమో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో మెమో దాఖలు చేసింది.
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఇవాళ హైకోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటూ శాసనసభలో ఈ నెల 22న, శాసనమండలిలో ఈ నెల 23న బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని హైకోర్టుకు తెలిపారు. కాబట్టి గతంలో రాజధానుల బిల్లుల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై తగు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంపై సోమవారం కీలక విచారణ చేపట్టబోతోంది. దీంతో హైకోర్టు వెలువరించే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మూడు రాజధానుల బిల్లుల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చెల్లకుండా పోతున్నాయి. మూడు రాజధానుల్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవడంతో ఆ పిటిషన్లపై విచారణ జరిపే అవకాశం లేదు. దీంతో హైకోర్టు వాటిని తానే ఆ పిటిషన్లు కొట్టేయడం లేదా పిటిషనర్లను ఉపసంహరించుకోవాలని కోరడం కానీ చేసే అవకాశముంది. ఈ రెండింటిలో ఏది జరిగిన రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన వందకు పైగా పిటిషన్లు వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నా వాటి స్ధానంలో మరో బిల్లును తీసుకొస్తామని ప్రకటించడంతో ఆ బిల్లును అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందాక మళ్లీ సవాల్ చేసే అవకాశం పిటిషనర్లకు ఎలాగో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి పిటిషనర్లు తమ పిటిషన్లను వెనక్కి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టి కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications