చేపల మార్కెటింగ్ పై జగన్ సర్కార్ ఫోకస్ .. ఫిష్ ఆంధ్రా పేరుతో ఆక్వా హబ్ లు.. ఏపీలో ఇంటి ముందుకే చేపలు!!
పరిశ్రమలను నిర్వహించడం కోసం ప్రోత్సహించడమే కాదు, పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఆక్వా రైతులకు మార్కెటింగ్ నిర్వహించడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్ ను ఏర్పాటు చేసి, ఈ వెహికల్స్ ద్వారా, మినీ ఫిష్ అవుట్ లెట్ లను ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు అండగా ఉండాలని, వారు ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేసి,ఆక్వా రంగం కుదేలు కాకుండా కాపాడాలని నిర్ణయం తీసుకుంది.
చేపల మార్కెటింగ్ పై ఏపీ ప్రభుత్వ దృష్టి.. ఆక్వా రైతులకు సపోర్ట్
మత్స్యకారులను ప్రోత్సహించడం కోసం, మత్స్య పరిశ్రమ ను నిర్వహించడం కోసం చేప పిల్లల పంపిణీ చేయడం, ఆక్వా రంగానికి చేయూతనివ్వడం అన్ని రాష్ట్రాలు చేసే పనే అయినప్పటికీ, మత్స్య పరిశ్రమలో ఉన్న రైతులు ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేయడం కోసం జగన్ సర్కార్ మాత్రమే ప్రత్యేకమైన దృష్టిసారించింది. పోషక విలువలు ఎక్కువగా ఉండే చేపలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నడుం బిగించింది. ఆక్వా రైతులు సాగు చేసే స్వచ్ఛమైన చేపలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తే ప్రజల్లోనూ చేపలపై ఆసక్తిని పెంపొందించడం సాధ్యమవుతుందని జగన్ సర్కార్ భావిస్తుంది.
దేశంలో 75 శాతం కంటే ఎక్కువగా చేపలు ఏపీ నుండే .. అయినా వినియోగంలో వెనకే
దేశవ్యాప్తంగా ఏపీ 75 శాతం కంటే ఎక్కువగా చేపలను ఉత్పత్తి చేస్తున్న, వాటి వినియోగంలో మాత్రం చాలా రాష్ట్రాలతో బాగా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలలో చేపలు వినియోగాన్ని ఎక్కువ చేయాలని, పోషక విలువలు ఎక్కువగా ఉండే చేపలను ప్రజలు తింటే ఆరోగ్యంగా ఉంటారు అనే భావనతో జగన్ సర్కార్ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో చేపలకు సరైన మార్కెటింగ్ లేకపోవడంతో, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడంపై ప్రధానంగా ఆక్వా రైతులు ఆధారపడుతున్నారు. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్రంలో ఆక్వా మార్కెటింగ్ పై ప్రభుత్వం దృష్టి సారించి ఆక్వా హబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఫిష్ ఆంధ్ర పేరిట ఆక్వా హబ్ ల ఏర్పాటుకు గుంటూరు, తెనాలిలో ఏర్పాట్లు
ఫిష్ ఆంధ్ర పేరిట ఆక్వా హబ్ ల ఏర్పాటుకు తొలుత గుంటూరు జిల్లాలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరం, తెనాలి, మంగళగిరి, నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండలో ఆక్వా హబ్ ల ఏర్పాటు కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. నవంబర్ 21వ తేదీన అంతర్జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా మొదట గుంటూరు తెనాలిలో హబ్ లను ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సొసైటీలు ఆక్వా హబ్ లను నిర్వహిస్తారు. ఈ ఆక్వా హబ్ లలో లైవ్ పూల్స్, ప్రాసెసింగ్ యూనిట్ లు అందుబాటులో ఉంటాయి. దీని కోసం రెండు కోట్లతో ఆక్వా హబ్ లలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తారు.
రిటైల్ యూనిట్లు, మొబైల్ వెహికల్స్ ద్వారా చేపల విక్రయాలు
ఇక ఈ హబ్ ల ద్వారా రిటైల్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. గ్రామ వార్డు స్థాయిలో ఈ వెహికల్స్, మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్ లు ఏర్పాటు కానున్నాయి. ఇక రిటైల్ దుకాణాలు, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరుపుకోవచ్చు.ఈ అవుట్ లెట్ లలో స్నాక్స్, ఆహార ఉత్పత్తులను కూడా విక్రయించవచ్చు. చేపల ఉత్పత్తుల విక్రయానికి కియోస్క్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొబైల్ ఫిష్ వెండింగ్, ఫుడ్ కోర్టులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
చేపల విక్రయాల యూనిట్లకు రాయితీలు, నిరుద్యోగులకు ఉపాధి
మినీ ఫిష్ రిటైల్ అవుట్లెట్ మినహా అన్ని రకాల యూనిట్లకు ప్రభుత్వం రాయితీ అందించనున్నట్టు తెలుస్తుంది. బీసీ జనరల్ కు 40 శాతం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 60 శాతం పెట్టుబడి రాయితీ గా ఇవ్వనున్నారు. దీనికోసం బ్యాంకుల నుండి రుణాలు సమకూర్చే విధంగా ఏర్పాట్లను కూడా చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆక్వా సాగుపై రైతుల ఆసక్తి పెరగడమే కాకుండా, రాష్ట్రంలో మార్కెటింగ్ కూడా బలోపేతమై ఆక్వా రంగానికి భరోసా ఇచ్చినట్లుగా ఉంటుంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో స్వచ్ఛమైన చేపలను తినడంతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అన్న భావన వ్యక్తమౌతుంది.