కోర్టు ధిక్కారంపై జగన్ సర్కార్ మధనం ? రికార్డు స్ధాయికి కేసులు-అధికారులే సమిథలు
ఏపీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు చేసే క్రమంలో అధికారులు చేస్తున్న తప్పిదాలు, కోర్టుల ఆదేశాలు పట్టించుకోకుండా ముందుకెళ్తున్న విధానం, వాటిపై కోర్టులు స్పందించి చేపడుతున్న ధిక్కార చర్యలు సంచలనం రేపుతున్నాయి. మరే రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 8 వేల కోర్టు ధిక్కార కేసులు నమోదుకావడం, నిత్యం ఏదో కేసులో కోర్టులు అక్షింతలు వేస్తుండటంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో ధిక్కార కేసుల వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే అసలు ఇంత రికార్డు స్దాయిలో ధిక్కార కేసులు నమోదు కావడం వెనుక ఏముంది ?
పతాకస్ధాయికి ఏపీ సర్కార్ కోర్టు ధిక్కారం
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో కోర్టు ధిక్కార కేసులు నమోదవుతున్నాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో దాఖలైన కేసుల్లో వెలువడుతున్న ఆదేశాల్ని ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోవడంతో భారీ స్దాయిలో ధిక్కార కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయన్న స్పృహ లేకుండా కొందరు అధికారులు చేస్తున్న తప్పిదాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. పలు సందర్భాల్లో అధికారుల తప్పిదాలతో దాఖలవుతున్న ధిక్కారం కేసుల్లో న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయి.
కోర్టు ధిక్కార కేసుల్లో ఇప్పటికే సీఎస్, డీజీపీ వంటి రాష్ట స్ధాయి ఉన్నతాధికారులు సైతం హైకోర్టు మెట్లు తొక్కారంటే పరిస్దితి తీవ్రత అర్ధమవుతోంది.
రికార్డు స్ధాయిలో 8 వేల కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కోర్టు ధిక్కార కేసుల సంఖ్య 8వేలకు చేరుకుంది. ఈ వివరాల్ని తాజాగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నిర్వహించిన సమీక్షలో న్యాయశాఖ కార్యదర్శి సునీత స్వయంగా వెల్లడించారు. దీంతో ఇంత భారీ స్ధాయిలో ధిక్కార కేసులు నమోదు కావడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. వెంటనే ఆయా కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయడం ద్వారా కేసుల్ని తొలగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రభుత్వమా ? కోర్టులా
ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను అమలు చేసే బాధ్యత అధికారులది. ఇలా అమలు చేసే క్రమంలో కోర్టులు లేవనెత్తే అభ్యంతరాలను పట్టించుకోవాలా వద్దా అనే అంశంలో అధికారుల్లో మీమాంస పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం మాట వినకపోతే ఓ సమస్య, కోర్టుల ఆదేశాలు పాటించకపోతే మరో సమస్య అన్నట్లుగా అధికారుల పరిస్ధితి మారిపోతోంది. దీంతో అటు ప్రభుత్వానికి చెప్పలేక, ఇటు కోర్టుల్ని మెప్పించలేక అధికారులు ధిక్కార కేసుల్లో బాధితులుగా మారుతున్నారు. దీనిపై అంతిమంగా కోర్టులు స్పందించి శిక్షలు విధించే పరిస్ధితులు రావడంతో అధికారులు తప్పనిసరిగా కోర్టు ఆదేశాలు పాటించాల్సి వస్తోంది.
Recommended Video
అధికారులదే తప్పంటున్న హైకోర్టు
గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్ ను కోర్టు విచారణకు పిలిపించిన హైకోర్టు.. నిజాయితీపరులైన మిమ్మల్ని కోర్టుకు రప్పించాల్సి రావడం బాధాకరమని పేర్కొంది. కింది స్ధాయి అధికారులు చేస్తున్న తప్పిదాలతో ఉన్నతాధికారులకు, ప్రభుత్వాలకు ఇబ్బందులు తప్పడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రభుత్వాధికారుల పాత్ర మరోసారి చర్చనీయాంశమైంది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులకు తమ విధి నిర్వహణలో బిజినెస్ రూల్స్ ఉంటాయి. అయితే కచ్చితంగా వాటిని మాత్రమే పాటిస్తే ప్రభుత్వ ఆగ్రహానికి గురి కాక తప్పదు. కోర్టులు మాత్రం సదరు అధికారి బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అన్నది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. దీంతో అధికారులే ఇక్కడ సమిధలుగా మారిపోతున్నారు.