ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం వద్దనే యోచనలో జగన్ సర్కార్ ... ఇక ఆ స్థానంలో ..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గతంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రస్తుత సర్కార్ పునరాలోచనలో పడింది. 1387 కోట్ల వ్యయంతో నిర్మాణం అవసరమా అని భావిస్తున్న జగన్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐకానిక్ బ్రిడ్జ్ స్థానంలో సాధారణ బ్రిడ్జి నిర్మించాలని భావిస్తోంది. ఒక పక్క కేంద్రం కూడా నో అని చెప్పటంతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పై జగన్ సర్కార్ వెనకడుగు వేసినట్లే అని అర్థమవుతుంది.

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో అమరావతి గొప్పతనం చాటాలనుకున్న గత ప్రభుత్వం
కృష్ణా నది మీద విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం నుంచి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖ్యాతిని ప్రపంచం వ్యాప్తం చేసే దిశగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని గత ప్రభుత్వం భావించి అందుకు శంకుస్థాపన సైతం చేసింది. రూ.1387 కోట్లతో నిర్మించాలి అనుకున్న ఈ ఐకానిక్ బ్రిడ్జి ప్రతి పిల్లర్ మీద తెలుగుజాతి సంసృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా పెయింటింగ్స్, అలాగే కూచిపూడి భంగిమలతో మన సాంస్కృతిక గొప్పతనం తెలియజేసేలా పిల్లర్స్ నిర్మాణం చెయ్యనుంది . ఎల్ అండ్ టీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఐకానిక్ బ్రిడ్జ్ ను పూర్తి చేసి రాజధాని ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని గత పాలకులు భావించారు. అయితే ప్రస్తుత సర్కారు మాత్రం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో విజయవాడ శివారులో పవిత్ర సంగమం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ భారీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తుంది.

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం .. సాధారణ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన
ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసిన ఈ బ్రిడ్జి కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇక దీనిని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపడుతోంది. 125 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ బ్రిడ్జికి ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్ ను కూడా నిర్మిస్తున్నారు.ఆరు లేన్లుగా నిర్మించనున్నఈ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ నిర్మాణం కూడా చేయాలన్న ఆలోచన ఉంది. ఇక పైలాన్ ఎత్తును 170 మీటర్లుగా నిర్థారించారు. ఈ వంతెన నిర్మాణం కోసం కృష్ణా నదిలో దాదాపు 36 పిల్లర్లను వేసేందుకు ప్రతిపాదించారు.
అయితే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో ఏపీ సర్కార్ సైతం ఇప్పటికే అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇంత ఖరీదైన బ్రిడ్జి ఎందుకు అన్న ఆలోచనలో ఉంది. సాధారణ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ఖజానా మీద భారం తగ్గించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

నిధుల విషయంలో కేంద్రం అభ్యంతరం ... 400 కోట్ల బడ్జెట్ తో సాధారణ బ్రిడ్జి నిర్మాణానికి డీపీఆర్
ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో విజయవాడలో ట్రాఫిక్ భారం చాలా వరకు తగ్గనుంది .అలాగే హైదరాబాద్ - జగదల్ పూర్ లకు వెళ్లే మార్గం 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో దాదాపు రెండు గంటల సమయం ఆదా అవుతుంది.
ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా సాధారణ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై డీపీఆర్ సైతం నేషనల్ హైవేస్ అథారిటీ త్వరలో పూర్తి చేయనుంది. అయితే ఈ సమయంలో కేంద్రం నిధుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏపీ సర్కార్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 400 కోట్ల బడ్జెట్ తో సాధారణ బ్రిడ్జి నిర్మాణం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఏపీ సర్కార్ విరమించుకున్నట్లే అని అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications