జగన్ సర్కార్ రహస్య జీవోల కలకలం-గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
ఏపీలో వైసీపీ సర్కార్ జారీ చేస్తున్న రహస్య జీవోల వ్యవహారం కలకలం రేపుతోంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన 12 బ్లాంక్ జీవోలే కావడం, అందులో ఒకటి రహస్య జీవోగా పేర్కొనడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆగస్టు 1 నుంచి నిన్నటివరకూ జారీ అయిన 78 జీవోల్లోనూ 46 జీవోలు ఇలా బ్లాంక్ జీవోలే కావడంతో ఇందులో ఏముందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
వైసీపీ సర్కార్ జారీ చేస్తున్న రహస్య జీవోలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యపహారంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్యతో పాటు మరికొందరు గవర్నర్ కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు ప్రభుత్వ తీరుపై గవర్నర్కు పలుమార్లు ఫిర్యాదు చేశామని వర్ల పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తే మాకేంటన్న రీతిలో వైకాపా ప్రభుత్వం ఉందని, అన్నీ బ్లాంక్ జీవోలే. ఇస్తున్నారని వర్ల ఆరోపించారు. 12రోజుల్లో 50 బ్లాంక్ జీవోలు ఇచ్చారని,. పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని వర్ల వ్రశ్నించారు.. బ్లాంక్ జీవోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారని వర్ల రామయ్య పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో జారీ అయిన రహస్య జీవోలతో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా సంచైత నియామకంతో పాటు పలు కీలక, వివాదాస్పద అంశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదో విషయాన్ని రహస్యంగా ఉంచుతూ ఈ జీవోలు జారీ చేస్తోందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తాజాగా సీఎంవోలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు ఈ బ్లాంక్ జీవోల జారీ అంశం కూడా విపక్షాలకు ఆయుధంగా మారుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం సున్నితమైన సమాచారం కావడంతోనే ఇలా బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నట్లు అనధికారికంగా చెబుతోంది.
ప్రస్తుతం రాజధాని విశాఖకు మార్చే అంశంతో పాటు ఆర్ధిక వ్యవహారాలపైనా విపక్షాల దాడి నేపథ్యంలో ప్రభుత్వం ఇలా రహస్య జీవోలు జారీ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఈ జీవోల్లో విషయాలు లీకైతే ప్రజల్లోకి విపక్షాలు తప్పుడు సంకేతాలు పంపుతాయని ప్రభుత్వం భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్ని రహస్య జీవోలు జారీ అవుతున్నట్లు అర్ధమవుతోంది.