కలుగులో ఎలుకల్ని పట్టినట్టు.. టీడీపీ హయాంలో స్కామ్లకు పాల్పడినవారిని పట్టే పనిలో జగన్ సర్కార్
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే దూకుడుగా ముందుకు వెళుతున్న జగన్ సర్కార్, తెలుగుదేశం పార్టీ నేతలను, అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివిధ కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టర్లను, డీలర్లను టార్గెట్ చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ లను తవ్వి తీస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏ శాఖలో కుంభకోణం జరిగినా సీఐడీని రంగంలోకి దింపుతుంది. కలుగులో ఎలుకల్ని పట్టినట్టు నాటి దొంగలను పట్టే పనిలో నిమగ్నం అయ్యింది.
టీడీపీ హయాంలో ఎస్సీ కార్పోరేషన్ నుండి వాహనాల సరఫరా స్కాం
ఇక తాజాగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలను సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న పలువురు డీలర్లను గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇక వాహనాలను అడ్వాన్స్ తీసుకుని కూడా సరఫరా చేయని డీలర్ల జాబితా సిద్ధం చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇక వారిపై చర్యలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్.
వాహనాల సరఫరా అడ్వాన్స్ లు తీసుకుని సరఫరా చెయ్యని డీలర్లపై చర్యలు
తాడేపల్లి లోని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున గతంలో వాహనాల సరఫరా చేయడానికి ఒప్పుకొని డబ్బులు కూడా తీసుకున్న డీలర్లు, వాహనాలను సరఫరా చేయకపోవడం లో జరిగిన అవకతవకలపై దృష్టి సారించాలని, దీనిపై సిఐడి దర్యాప్తు కూడా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎస్సీ లకు సంబంధించిన డబ్బులు ఒక రూపాయి దుర్వినియోగమైనా సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
క్రిమినల్ కేసులు పెట్టండి.. మంత్రి ఆదేశం
అవసరమైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడవద్దని మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రైయిన్ క్లీనర్ సరఫరాకు వెంకటేశ్వర ట్రేడర్స్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్, ఈగల్ అగ్రి ఎక్విప్మెంట్స్, ఎంట్రాన్స్ ఆటోమొబైల్స్ వంటి సంస్థలకు చెందిన డీలర్లు 46 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నారు. కానీ ఆ కంపెనీలు తాము తీసుకున్న డబ్బులకు తగ్గట్టు వాహనాలను సరఫరా చేయలేదు. ఇక సరఫరా చేయని వాహనాల తాలూకా మిగిలిపోయిన డబ్బులను తిరిగి చెల్లించలేదు. ఈ క్రమంలోనే దీనిపై దృష్టి సారించిన మంత్రి మేరుగు నాగార్జున వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సిఐడి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎస్సీ కార్పోరేషన్ లో డిప్యుటేషన్ పై వచ్చిన వారిని వెనక్కు పంపాలని ఆదేశం
ఇక అంతే కాదు రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై వచ్చి ఎస్సీ కార్పొరేషన్ లో ఈ డి లుగా పనిచేస్తున్న వారిని ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న వారిని, వారి సొంత శాఖలకు తిరిగి వెనక్కి పంపించాలని మంత్రి నాగార్జున సూచించారు. అంతేకాదు కేంద్రం పీఎం అజయ్ పథకం లో భాగంగా కేటాయించిన 60 కోట్ల రూపాయల కార్యాచరణ ప్రణాళిక జనవరి నెలాఖరులోగా పూర్తి చెయ్యాలని మంత్రి మేరుగు నాగార్జున అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.