జగన్ సర్కార్ నిర్ణయం : మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం, ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో మళ్లీ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. రేపటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు బయోమెట్రిక్ తోనే హాజరు నమోదు చేయాలని ఏపీ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలలో పనితీరు మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్ గతంలో అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని మళ్లీ తాజాగా పునరుద్ధరించింది.
కరోనా కారణంగా నిలిపేసిన బయోమెట్రిక్ .. మళ్ళీ పునరుద్ధరణ
కరోనా మహమ్మారి విజృంభణకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం అమల్లో ఉండేది. అయితే కరోనా మహమ్మారి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని, వస్తువుల పైన కూడా కరోనా వైరస్ బ్రతికి ఉంటుందన్న కారణంగా బయోమెట్రిక్ విధానాన్ని తీసివేశారు. వేలిముద్రలు ద్వారా హాజరు నమోదు చేసే విధానానికి స్వస్తి పలికి కరోనా బారిన పడకుండా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు. అయితే ఇంతకాలం తొలగించిన బయోమెట్రిక్ విధానాన్ని, మళ్లీ తిరిగి పునరుద్ధరిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కీలక ఉత్తర్వులను జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కీలక ఉత్తర్వులను జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మే నెల నుండి బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు ఇచ్చిన ఏపీ సర్కార్, ఈ నెల 13వ తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఉద్యోగుల హాజరు నమోదుకు మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.
రేపటి నుండే ఆదేశాలు అమలు, ప్రభుత్వ ఉద్యోగులను గాడిలో పెట్టే యత్నం
హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, మరియు సచివాలయాలలో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అంతేకాదు నెలవారి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కూడా సూచించారు. తాము పంపించిన ఆదేశాలను తక్షణం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకొని తిరిగి సాధారణ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పాఠశాలలను తెరిచి తరగతులను నిర్వహించేలా చూస్తుంది ఏపీ సర్కార్. ఇక ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిపాలనను తిరిగి గాడిలో పెట్టేలా పలు నిర్ణయాలతో ముందుకు పోతోంది జగన్ సర్కార్.
ఏపీలో నిత్యం నమోదవుతున్న కరోనా కేసులు, పాలన గాడిలో పడుతుందా ?
ఇదిలా ఉంటే ఏపీలో నేటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1248 కేసులు నమోదు కాగా 15 మరణాలు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం కేసులలో రోజువారి కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్ లో ఉంది. మరి ఇలాంటి సమయంలో పరిపాలనను తిరిగి గాడిలో పెట్టేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications