టీడీపీ నేత మురళీ మోహన్ కు జగన్ సర్కార్ భారీ షాక్ .. జయభేరి కన్స్ట్రక్షన్స్ కు రూ1.5 కోట్లు ఫైన్
ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ టిడిపి నేత మురళీ మోహన్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మురళీమోహన్ కు సంబంధించిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కు భారీ జరిమానా విధించింది. ఆంధ్ర ప్రదేశ్ శాసన రాజధాని అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్స్ట్రక్షన్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొన్న అధికారులు ఒకటిన్నర కోట్ల రూపాయలు జరిమానా విధించారు.

కుంచనపల్లి వద్ద జయభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు .. నిబంధనలు పాటించలేదన్న ఏపీ సర్కార్
కుంచనపల్లి లో జాతీయ రహదారి పక్కనే ఏడెకరాల ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్స్ట్రక్షన్స్ 2016లో అక్కడ నిర్మాణాలు చేపట్టింది. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, దానిని కమర్షియల్ ల్యాండ్ గా మార్చుకుండానే నిర్మాణాలు చేపట్టినట్లుగా అధికారులు గుర్తించడంతో , నిబంధనలు పాటించని జయభేరి కన్స్ట్రక్షన్ పై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది . చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం మూడు శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటుగా, జరిమానా సైతం విధించింది.

వ్యవసాయ భూముల్లో కమర్షియల్ నిర్మాణాలు.. కోటిన్నర రూపాయల జరిమానా
నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టినందుకు ఒక కోటి రూపాయలు ఫీజు, అపరాధ రుసుము కింద 50 లక్షల రూపాయలు చెల్లించాలని జయభేరి కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు పంపించింది. దీంతో ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్లుగా సమాచారం. గతంలో టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలను, టిడిపి నాయకులు సాగిస్తున్న వ్యాపారాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ వారిపై ఉక్కుపాదం మోపే పనిలో ఉంది.

ఏపీలో టీడీపీ నేతలకు కష్టకాలం .. ఇప్పుడు మురళీమోహన్ వంతు
అందులో భాగంగానే ఇటీవల సంగం డెయిరీని నిర్వహిస్తున్న ధూళిపాళ్ళ నరేంద్ర పై కేసు బనాయించి అరెస్ట్ చేసింది. ఏపీలో ముఖ్యమైన టీడీపీ నేతలు దేవినేని ఉమా , అచ్చెన్నాయుడు, కోల్లు రవీంద్ర , యరపతినేని, కూన రవి కుమార్ , సబ్బంహరి , బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ తదితరులపై ఇప్పటికే అణచివేతలకు దిగిందని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . పలువురిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టటం కక్ష సాధింపు చర్యలో భాగం అంటున్నారు . తాజాగా మురళీమోహన్ ని టార్గెట్ చేసి భారీ జరిమానా విధించి ఝలక్ ఇచ్చింది జగన్ సర్కార్ .












Click it and Unblock the Notifications