చంద్రబాబు రియలైజ్, మారుతున్న వ్యూహాలు: 'పీకేపై ఎక్కువగా ఆధారపడుతున్న జగన్'
చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు కేడర్కు సూచిస్తున్నారు.
చంద్రబాబు ఆర్థిక సంస్కరణలకు పేరుగాంచారు. ఆయన ప్రజాకర్షక పథకాలకు దూరంగా ఉంటారనే పేరు గతంలో ఉండేది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది రైతులకు రుణమాఫీ. ఇది సంచలనం అయింది. వైసీపీ ఓడిపోవడానికి ఇదే ముఖ్య కారణంగా చెబుతారు.
ఒబామా 'మైక్రో టార్గెటింగ్ స్ట్రాటేజీ': జగన్కు పీకే సరికొత్త వ్యూహం, అసలేమిటి?
రియలైజ్ అయిన చంద్రబాబు
గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు చేపట్టారు. ఓట్ల కోసం ఆయన ఎన్నో ఉచితాలు తీసుకు వచ్చారని అంటుంటారు. అయితే, ఇలాంటి వాటిని సహజంగా వ్యతిరేకించే చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో గెలుపు కోసం ఊహించనిరీతిలో హామీలు ఇచ్చారని అంటున్నారు. ఈ దారిలో వెళ్లకుంటే కోలుకోలేమని భావించి ఆయన ఆ దారిలో నడిచారని అంటున్నారు. చంద్రబాబు రియలైజ్ అయి పథకాలను ప్రవేశ పెట్టారని అంటున్నారు.
అదే దారిలో జగన్
వైసీపీ అధినేత వైయస్ జగన్ కూడా చంద్రబాబు పథకాలు అమలు చేయలేనివని పదేపదే విమర్శించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేర్చడం లేదని మండిపడుతుంటారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో నడుస్తూ తన పాదయాత్రలో పథకాలను పల్లె వేస్తున్నారని అంటున్నారు. పింఛన్ మొదలు ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఇటీవల నవరత్నాలను ప్రకటించారు. అవసరమైతే అందులో మార్పులు చేస్తానని చెప్పారు.
వివరాలు సేకరించిన ప్రశాంత్ కిషోర్ టీం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు వైయస్ జగన్, ఆ పార్టీ కేడర్ మైక్రో టార్గెటింగ్ స్ట్రాటెజీ వ్యూహాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురితో జగన్ సమావేశమవుతున్నారు. జగన్ పాదయాత్ర లేని చోట వైసీపీ నాయకులు ఆయా వర్గాలతో భేటీ అవుతున్నారు. టీడీపీ పట్ల ఏఏ వర్గాల్లో అసంతృప్తి ఉంది, చంద్రబాబు ఏ హామీలు ఇచ్చారు, ఎవరికి నెరవేర్చలేదు, వారి సంతృప్తి, అసంతృప్తి తీరు ఎలా ఉందనే అంశాలను ప్రశాంత్ కిషోర్ టీం సేకరించింది. దాని ఆధారంగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
ఆ వైపు మరలుతున్నారు
వైయస్ ఉచితాలను వ్యతిరేకించిన టీడీపీ, ఆ తర్వాత 2014లో అవే అమలు చేస్తోంది. జగన్ కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకానివని ఆరోపించారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిలో ఇష్టారీతిన పథకాలను ప్రకటిస్తున్నారని అంటున్నారు. పథకాల విషయంలో పార్టీలు ఎప్పటికప్పుడు కరక్షన్ చేసుకుంటున్నాయి. గెలుపు కోసం ఇష్టారీతిన హామీలు ఇస్తున్నారని అంటున్నారు.
పీకే జగన్కు మైనస్, ఆ హామీలు పట్టించుకోవడం లేదా?
ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఏ విషయంలోను ఫెయిల్ కాలేదని, దానిని జగన్ వేలెత్తి చూపలేరని, ఆయన చూపినా ప్రజలు నమ్మలేరని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ పైనే ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని, తాము అలా పాలించడం లేదని, అలాంటప్పుడు తమను ఎలా ఆ విషయంలో ప్రశ్నించగలరని టీడీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా జగన్ ప్రశాంత్ కిషోర్ వంటి వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, కానీ ఇటీవల ఆయన వ్యూహాలు పని చేయడం లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అది ఆయనకు పెద్ద మైనస్ అంటున్నారు. మరోవైపు, ఎన్నికలకు మరో ఏడాదికి పైగా గడువ ఉందని, కాబట్టి ప్రజలు జగన్ ఇష్టం ఇచ్చినట్లుగా ఇస్తున్న హామీలను పట్టించుకోవడం లేదని అంటున్నారు.