జగన్ దే ఎక్కువ నేరం... అతడి ఆస్తులు వేలం వేయాలి: చంద్రబాబు
అమరావతి:ఆర్థిక నేరాలు జరిగిన చోట్ల ఆస్తులు వేలం వేస్తున్నారు...అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ న్యాయస్థానం ద్వారా వేలం వేస్తున్నాం...ఆ సంస్థ వాళ్లు అప్పులు చేసి ఆస్తులు కొన్నారు. కానీ అప్పులు తీర్చలేదు. దీంతో వారి వ్యక్తిగత ఆస్తులూ వేలం వేస్తున్నాం.
మరి వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో ఈ రూలు ఎందుకు వర్తించదు?...అతడిదీ మోసమే...జగన్...అగ్రిగోల్డ్, నీరవ్ మోదీ కంటే ఎక్కువ నేరం చేశాడు. మరి జగన్ విషయంలో ఎందుకు కోర్టులో ఇతర కేసుల్లో జరిగినట్లు జరగడం లేదు...అతడి ఆస్తులు ఎందుకు వేలం వేయడం లేదు...ఎవరు దీనికి కారణం?...ఆయన కేసులన్నీ నీరుకార్చడం లేదా?...ఎవరు ఇదంతా చేస్తోంది?...అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. టిడిపి పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్...రాష్ట్రానికి ద్రోహం
దేశంలో జగన్దే ఎక్కువ నేరం...ఆయన అవినీతితో ఆస్తులు పోగేశారు...తెలుగుదేశం నీతిగా ఉంది. మేము రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై పోరాడుతున్నాం. కానీ వైసీపీ నాయకుడు...వాళ్లు నాడు బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఇప్పుడు ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారు...రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఎన్నికలు రాకుండా లగ్నం చూసి రాజీనామాలు ఆమోదించుకుంటారు. ఇదో నాటకం-బూటకం. కాంగ్రెస్ మోసం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకీ అంతకంటే ఎక్కువ బుద్ధి చెబుతారు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.
ఇంత సంక్షేమం...ఎనలేని సంతృప్తి
రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో చేసిన సంక్షేమం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతృప్తిని ఇచ్చిందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. ఒక వ్యక్తి జీవితచక్రంలో కడుపులో ఉన్నప్పటి నుంచి.. చిన్నతనం, విద్యార్థి దశ, ఉద్యోగం, పెళ్లి, వృద్ధ్దాప్యం, మరణం వరకు అన్ని దశల్లోను ప్రభుత్వ సాయం అందేలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. మానవత్వంతో, పేదోడికి అండగా.. ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటానన్న మాట మేరకు తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్, పౌష్టికాహారం, స్కాలర్షిప్, విదేశీ విద్యకు సాయం, పెళ్లి కానుక, ఫించను, చంద్రన్న బీమా.. అన్నీ పెట్టామని గుర్తుచేశారు. గ్రామాల్లో వీటివల్ల లబ్ధి పొందినవారు కన్నీళ్లతో ఆ సాయం పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తుంటే...ఎస్...నేను సరైన పనే చేశానని అనిపిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఒంటరి మహిళకు...ఫించన్
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక ఆసక్తికర ఘటన గురించి వివరించారు. ఒక గ్రామంలో తాను మాట్లాడుతూ జీవితంలో ఈ పథకాల కింద కవర్ కాకుండా ఎవరైనా ఎక్కడైనా ఉంటారా అని అడిగానని...దానికి వారు సమాధానం చెప్పేందుకు 10 నిమిషాల పాటు ఆలోచించారని...చివరకు ఒక ఒంటరి మహిళ...అందరూ కవర్ అవుతున్నారు. కానీ భర్త వదిలేసిన మహిళలకు లబ్ధి చేకూరడం లేదని చెప్పినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీంతో తాను వెంటనే ఒంటరి మహిళలకూ పింఛను సౌకర్య కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు.
అప్పుడు అలా...ఇప్పుడు ఇలా
తాను పాదయాత్ర చేసిన సమయంలో రాష్ట్రంలో ఏ గ్రామంలోకి వెళ్లినా ఎండాకాలం దుమ్ము...వర్షాకాలం బురద ఉండేవని...అయితే తాము ఇప్పుడన్నీ సిమెంటు రోడ్లు వేశాం." నాడు రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన, భరించలేని దుర్వాసన ఉండేవి. ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ వందశాతం మందికీ మరుగుదొడ్లు నిర్మించాం. నవనిర్మాణ దీక్షలో ఇళ్ల ప్రారంభోత్సవాలకు వెళితే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. చంద్రన్న బీమాతో కుటుంబాలకు ఆధారమైన వారు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డునపడకుండా మీరిచ్చిన రెండు లక్షలు, ఐదు లక్షలే ఉపకరించాయని, మీరే లేకుంటే ఏమైపోయేవారమోనని కన్నీళ్లతో చెబుతున్నారు. ఆడపిల్లలకు పెళ్లికానుక ఇవ్వడంతో వారి ఆత్మగౌరవం పెరిగింది.పెళ్లికి అప్పుచేయాల్సిన పని చాలావరకు తప్పింది. నా పాదయాత్ర సమయంలో రైతుకు దిక్కుతోచని స్థితి. సాగునీరు లేక, విద్యుత్ రాక, విత్తనాలు, ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన దుస్థితి.
జర్నలిస్టులూ...జగన్కు చూపించండి
"రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితులు ఏవీ లేవు. ఇదీ మేం తెచ్చిన మార్పు...జర్నలిస్టులూ...ఒకపని చేయండి. దేశంలోని 4 రాష్ట్రాలను ఎంపిక చేసుకోండి. ఒక్కో రాష్ట్రంలో ఒక గ్రామాన్ని ఎంచుకోండి. మీతోపాటు జగన్ను కూడా తీసుకెళ్లండి. మేమే పంపిస్తాం. చూసిరండి. దేశంలో మన రాష్ట్రంలో కంటే ఎక్కడైనా ఎక్కువ సంక్షేమం, ఎక్కువ బాగున్న గ్రామం ఉందేమో చెప్పండి...ఇంత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంటే వాటిని వదిలేసి...ఎక్కడో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒకరిద్దరు ఉంటారు"...అని చంద్రబాబు జర్నలిస్టులకు సూచించారు.
వనరులే కాదు...సామర్థ్యంతో...
కేవలం ఆర్థిక వనరులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదని...సామర్థ్యంతో కూడా అభివృద్ధి సాధించవచ్చని చంద్రబాబు చెప్పారు. కష్టపడి పనిచేయడం, తెలివితేటలు, అనుభవం ఇందుకు ఉపకరిస్తాయి. గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్లు వేసేందుకు ఒక్క పైసా ఖర్చుకాలేదు. విద్యుత్ బిల్లుల ఆదాతో ఆ పని అయ్యేలా చేశాం. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పలు పనులు చేశాం. ఒక్క మే నెలలోనే రూ.1500 కోట్ల వేతనాలను ఉపాధి కూలీలకు చెల్లించాం. ఇన్ని చేస్తుంటే ఒకాయన ఏమీ చేయడం లేదంటారు. బడ్జెట్ గురించి మాట్లాడతారు. బడ్జెట్ అంటే ఆయనకు ఏం తెలుసు? ఆయనకున్న అనుభవం ఏంటి?'..అని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు.
కేంద్రం నిర్ణయం...దారుణం
గ్యాస్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం నిర్ణయించడం దారుణంమని...ధరలు తగ్గించాలని అడిగితే కేంద్రం ఈ పనిచేయడం ఏంటన్నారు? ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని...రాష్ట్రాల ఆదాయానికి గండికొట్టడమేనన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. మోదీని నమ్మి ఓట్లేస్తే బ్యాంకుల్లో నోట్లు లేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా అనంతపురం జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్తే అక్కడి చెరువులో నీళ్లున్నాయి. వందల ఏళ్ల నుంచి నీళ్లు రాలేదు. ఇప్పుడొచ్చాయంటూ అక్కడి ప్రజలు అత్యంత సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచబ్యాంకు చేసిన సంతోష స్థాయి సూచికలో రాష్ట్రం ర్యాంకు మెరుగుపడగా...కేంద్రం ర్యాంకు పడిపోయింది. రాష్ట్రప్రభుత్వంపై ప్రజల సంతృప్తి శాతం కూడా గత వారం 73 శాతం ఉంటే ఈ వారానికి 77 శాతానికి పెరిగిందని చంద్రబాబు చెప్పారు.