సీఎం జగన్ తాజా వ్యూహం ..మూడు రాజధానుల కోసం.. టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ కార్యాచరణ
ఏపీలో రాజధానిపై నెలకొన్న అనిశ్చితి వీడటం లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరు నూరైనా సరే మూడు రాజధానుల ఏర్పాటు చేసి తీరతానని కంకణం కట్టుకున్నారు. ఇక రాజధాని అమరావతి కోసం చివరి దాకా పోరాటం సాగిస్తామని అటు రాజధాని ప్రాంత రైతులు, ప్రతిపక్షాలు గట్టిగానే చెప్తున్నాయి. 50 రోజులుగా పోరాటం సాగిస్తున్నాయి. అంతే కాదు రాజధానిగా అమరావతినే కొనసాగాలని భావిస్తున్న రైతులు రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల నుండి కూడా అమరావతి కోసం మద్దతు కూడగడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో సీఎం జగన్ తాజాగా మరో వ్యూహానికి సిద్ధం అయ్యారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళనున్న వైసీపీ
ఏపీ మూడు రాజధానులపై సీఎం జగన్ కొత్త వ్యూహాన్ని అవలంబించాలని భావిస్తున్నారు. ఒకపక్క రాజధాని అమరావతికి విశేషంగా మద్దతు అందుతున్న వేళ తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదని మద్దతు కూడగట్టాలని ఆయన భావిస్తున్నారు. నిన్నటికి నిన్న తాను మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న స్పష్టమైన కారణాలను చాలా వివరంగా చెప్పిన జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేసేందుకు జగన్ వ్యూహాత్మక ఎత్తుగడ
ఇక అమరావతి విషయంలో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేసేందుకు సీఎం జగన్ ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో , మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను , నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు . దీనికి సంబంధించి నేటి నుంచే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి విభిన్న కార్యకరమాలు
విభిన్న కార్యక్రమాల ద్వారా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు సాధించాలని సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించనున్నారు .ఇక రేపు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుతూ వైసీపీ శ్రేణులు పూజలు చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

15వ తేదీ వరకు మూడు రాజధానులకు ప్రజల మద్దతు కూడగట్టే యత్నం
ఫిబ్రవరి 12వ తేదీన వంటా వార్పు కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన రిలే నిరాహార దీక్షలు ద్వారా మూడు రాజధానులకు ప్రజల మద్దతు కూడగట్టనున్నారు
ఫిబ్రవరి 14వ తేదీన గులాబీ పూలతో కలిపి మూడు రాజధానుల ఆవశ్యకతను తెలిపే కరపత్రాల పంపిణీ చెయ్యనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత నిర్వహించనున్నారు. ఇలా 15వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మూడు రాజధానులపై సానుకూలత సాధించేందుకు ప్రయత్నం చెయ్యనుంది వైసీపీ .

విద్యార్థి యువజన విభాగాలకు బాధ్యత .. టీడీపీ ప్లాన్ తిప్పికొట్టటమే లక్ష్యం
ఈ బాధ్యతలు వైసీపీ విద్యార్థి యువజన విభాగాలకు అప్పజెప్పింది. రాజధాని అమరావతి కోసం అంటూ టీడీపీ చేస్తున్న ఆందోళనలను తిప్పికొట్టే వ్యూహమే కాకుండా ప్రజల నుండి మూడు రాజధానులకు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యూహం రచించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఏది ఏమైనా ఏపీలో మూడు రాజధానుల ప్రతికూల, అనుకూల కార్యక్రమాలతో నెలకొన్న గందరగోళం రాష్ట్రంలో అనిశ్చితికి కారణంగా మారుతుంది.












Click it and Unblock the Notifications