AP Legislative council Chairman: అయన వైపే సీఎం జగన్ మొగ్గు..!! సభలో వైసీపీకి పూర్తి ఆధిపత్యం..!!
ఏపీ శాసనమండలికి కొత్త ఛైర్మన్ రానున్నారు. ఇప్పటి వరకు ఛైర్మన్ గా వ్యవహరించిన షరీఫ్ అహ్మద్ పదవీ విరమణ చేసారు. టీడీపీ హయాంలో 7 ఫిబ్రవరి 2019 న షరీఫ్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన్నే కొనసాగించారు. మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు..సీఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో నాడు ఛైర్మన్ తీరు పైన సీఎంతో సహా వైసీపీ అసహనం వ్యక్తం చేసినా..ఆయనను తప్పించే ప్రయత్నాలు మాత్రం చేయలేదు. ఇక మండలి నుంచి షరీఫ్ పదవీవిరమణ పొందడంతో మండలి ఛైర్మెన్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మండలి కొత్త ఛైర్మెన్ ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మండలిలో ఖాళీలు
షరీఫ్ తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన డీసీ గోవిందరెడ్డి పదవీ విరమణ చేసారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మూడుతో పాటుగా ఈ నెల 18న స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏడు టీడీపీకి కాగా..వైసీపీ నుండి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో..అప్పటి నుండి పెద్దల సభలో టీడీపీ సంఖ్యా బలం మొత్తం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. దీంతో..శాసన మండలిలో సైతం వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కనుంది.

ఇక్బాల్ వైపు జగన్ చూపు
ఇదే సమయంలో మండలి ఛైర్మన్..వైస్ ఛైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పటి వరకు డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రమణ్యం సైతం టీడీపీ నుండే ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 18వ తేదీతో ముగుస్తుంది. దీంతో పాటుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళ్లటంతో సభా నాయకుడిగా సైతం వైసీపీ నుండి ఖాళీ కనిపిస్తోంది. దీంతో..ఈ మూడు నియామకాలను సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శాసన మండలి ఛైర్మన్ గా ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీకి చెందిన షరీఫ్ కొనసాగటంతో ఆయన స్థానం రాయలసీమ ..మైనార్టీ నేత..హిందూపురం కు చెందిన నాయకుడు..మాజీ ఐపీఎస్ అధికారి..చంద్రబాబు కు భద్రతా అధికారిగా పని చేసిన ఇక్బాల్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో ఆయనకు హిందూపుర్ సీటు ఇచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన బాలక్రిష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయించారు. 2027 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉండనున్నారు.

డిప్యూటీ ఛైర్మెన్గా జంగా క్రిష్ణమూర్తి
ఇక, డిప్యూటీ ఛైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ..వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా క్రిష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే విధంగా మండలి ప్లోర్ లీడర్ గా సీనియర్ అయిన ఉమ్మారెడ్డి పేరు వినిపిస్తున్నా...ఆయన రాజ్యసభ ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అందుకు అంగీకరిస్తే సీ రామచంద్రయ్యకు ఆ స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే, కడప జిల్లా నుండే ఆ స్థానం ఇస్తారా అనేది కొంత సందేహంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన వారికి ఆ స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన పార్టీలో ఉంది. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు వైసీపీ నుండి శాసన మండలికి నామినేట్ కానుండటంతో..చివరి నిమిషంలో సమీకరణాలు మారితే మినహా మండలి ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ల విషయంలో వీరికే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి..సీఎం జగన్ ఈ నియామకాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications