బాబు 'ఆకర్ష్'కు విరుగుడు: విజయసాయి రెడ్డికి జగన్ చేయి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆపరేషన్ ఆకర్ష్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విరుగుడు కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన విజయసాయి రెడ్డికి టికెట్ నిరాకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. బిసీకి టికెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ను అడ్డుకోవాలని జగన్ చూస్తున్నట్లు సమాచారం.
బీసీకి టికెట్ ఇవ్వడం ద్వారా రెడ్లకే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు కూడా పార్టీ తగిన స్థానం కల్పిస్తుందనే సంకేతాలను పంపాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ తరపున బిసి అభ్యర్థిని నిలబెడితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నాలుగో సీటును చంద్రబాబు గెలవాలనుకుంటే అది తమకు ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కావాలని చంద్రబాబు బీసీ అభ్యర్థిని ఓడించారనే అపవాదును భరించాల్సి వస్తుందని, దానివల్ల తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి చంద్రబాబు వెనకాడుతారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. బిసి అభ్యర్థిని ఓడించేందుకు టిడిపి నాయకత్వం వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటుందనే ప్రచారాన్ని టిడిపిపైకి ఎక్కు పెట్టే అవకాశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దక్కుతుంది.
దాంతో కోస్తాకు చెందిన బలమైన బిసి అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికలలో బరిలోకి దించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికల బరిలో పార్టీ తరపున బిసి అభ్యర్థిని దించాలన్న యోచనలో ఉన్న జగన్ ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి విజయసాయిరెడ్డికే రాజ్యసభ సీటు అని తొలినుంచి ప్రచారం సాగింది. కానీ మధ్య దాసరి నారాయణరావు వైసిపిలోకి వస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. దీంతో దాసరికి రాజ్యసభ అన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు మారడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బిసి అభ్యర్థినే రాజ్యసభ ఎన్నికల బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం.