అప్పుడేమో సన్మానాలు...ఇప్పుడేమో రాజీనామాలా బాబూ!:జగన్
గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు బెంజ్ కారు ఇస్తానని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. జనం జేబుల్లోంచి పోగేసిన సొమ్మును ఓట్లను కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర 115వ రోజులో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని పెదనందిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైఎస్ జగన్ మాట్లాడారు.
ఏపీకి అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యేక హోదా ఇవ్వలేమని...కేవలం ప్యాకేజీ మాత్రమే ఇస్తామని 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు ఏమాత్రం వ్యతిరేకించక పోగా స్వాగతించారని వైఎస్ జగన్ చెప్పారు. ఆ తరువాత కేంద్రాన్ని పొగుడుతూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి జైట్లీకి సన్మానం చేశారన్నారు.
మరి అదే జైట్లీ ఇటీవల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన మరోసారి చేయగానే అదేదో కొత్తగా చెప్పినట్లు తన మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించారని, ఇక్కడే చంద్రబాబు మోసం అర్థం అవుతోందని జగన్ అన్నారు. మరి ప్రత్యేక హోదా కావాలనుకుంటే ప్రత్యేక ప్యాకేజీకి వ్యతిరేకంగా అప్పుడే ఎందుకు చంద్రబాబు రాజీనామాలు చేయించలేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని, ఈ నాలుగేళ్లు డ్రామాలాడారని జగన్ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదంటూ జగన్ వ్యాఖ్యానించారు.
87, 612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాలంటే తాను సీఎం కావాలన్నారు చంద్ర బాబు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల గడిచినా రుణాలు మాఫీ చేయకపోగా, బ్యాంకుల నుంచి నోటీసులు పంపిస్తున్నారని చెప్పారు. ఆ రుణ మాఫీ కథ ఏమైందీ చంద్రబాబు అని నిలదీశారు. గత పాలకులు, ప్రభుత్వాలు బ్యాంకుల వద్ద నుంచి రైతులకు రుణాలు ఇచ్చేవని...ఆపై ఆ నగదును బ్యాంకులకు ప్రభుత్వాలు చెల్లించేవని చెప్పారు. రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు బ్యాంకుల ద్వారా రైతులకు నోటీసులు పంపిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రమంతటా రైతులు ఇబ్బందులు పడుతున్నా, చంద్రబాబు చూస్తు కూర్చున్నారే తప్పా ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరి సాగుకు ఖర్చు 1900 అని ప్రభుత్వమే చెబుతున్నా, మద్దతు ధర మాత్రం రూ. 1600 ఉందని, మిర్చి పంట ఉత్పత్తికి 7-8 వేలు అవుతుంటే... మిర్చి అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే వారి బాధలను చూడలేక తాను వచ్చి గుంటూరు మిర్చియార్డులో దీక్ష చేశానన్నారు.మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కేవలం 1100 ఉందని, కంది పంట ఉత్పత్తి రూ. 5600 అయితే కనీసం మద్దతు ధర 5400 అయితే కనీసం రూ.4000 కు కొనే దిక్కులేదని చెప్పారు. దళారీలకు సాక్షాత్తూ సీఎం చంద్రబాబే నాయకుడు కావడం ఎపి ప్రజల దౌర్భాగ్యమని...రైతుల నుంచి తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి ఎన్నోరెట్ల ధరలకు చంద్రబాబు అమ్ముకోవడం నిజం కాదా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.