పయ్యావుల సెక్యూరిటీ తగ్గింపు వెనక్కి తగ్గిన ప్రభుత్వం- మళ్లీ గన్ మెన్ల కేటాయింపు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రతను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. తిరిగి కొత్తగా గన్ మెన్లను పంపుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం పయ్యావుల కేశవ్ కు గన్ మెన్లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో గన్ మెన్లు వెనక్కి వెళ్లిపోయారు. కొన్నిరోజులుగా వైసీపీ ప్రభుత్వం టీడీపీపై నిఘా పెట్టిందని, ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందనే ఆరోపణలు చేస్తున్న పయ్యావుల కేశవ్ కు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతను ఉపసంహరించిందనే విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. అనంతరం అధికారులతో సమీక్షించిన తర్వాత తిరిగి కొత్తగా గన్ మెన్లను పంపుతున్నట్లు సమాచారం ఇచ్చారు.

జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనంతరం కొత్తగా పయ్యావులకు కేటాయించిన గన్ మెన్లు తమకు తాము పరిచయం చేసుకున్నారు. కానీ పయ్యావుల మాత్రం రిజర్వ్ ఇన్ స్పెక్టర్ స్ధాయి అధికారి వచ్చి గన్ మెన్లను మార్చిన విషయం తనకు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికే తిరిగి భద్రతను ఇచ్చేసిన నేపథ్యంలో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడినట్లు భావిస్తున్నారు. మరి టీడీపీ ఈ విషయంపై ఇప్పటికైనా విమర్శలు ఆపుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications