ఉద్యోగ నేతలతో జగన్ సర్కార్ నేడు చివరి భేటీ! కీలక ప్రకటనలు వస్తాయా?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాలతో ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నిర్వహించబోతోంది. దీంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీగా భావిస్తున్నారు. ఇందులో గత భేటీలో చర్చించిన అంశాలపై మరోసారి చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్సీకి ముందు ఐఆర్ ఇచ్చేది లేదంటూ గత భేటీలో తేల్చేసిన ప్రభుత్వం.. ఈసారి దీనిపై ఏం చెప్పబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని 15 ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు అందింది. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో జూలైలో పీఆర్సీ ఇచ్చేస్తామని, కాబట్టి అంతకంటే ముందు ఐఆర్ ఇవ్వలేమంటూ ప్రభుత్వం తేల్చేసింది. దీనిపై ఇవాళ జరిగే భేటీలో మరోమారు ఉద్యోగ సంఘాలు ప్రస్తావించే అవకాశముంది. అలాగే పెండింగ్ పెట్టిన బకాయిల్లో ఏంతో కొంత ఎన్నికలకు ముందు ఇప్పించేలా ఉద్యోగ సంఘాలు పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెల్త్ స్కీమ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు వంటి పెండింగ్ అంశాలు ఎలాగో ఉన్నాయి.

ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఆర్ధిక ప్రయోజనాలు లభించలేదనే అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు తమకు ప్రతికూలంగా పనిచేయకుండా ఎలాంటి బుజ్జగింపులు చేస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులు పలు అంశాలపై సమ్మె వరకూ వెళ్లి చివరి నిమిషంలో ప్రభుత్వ హామీలతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చివరి భేటీ కావడంతో ఇవాళ ఏదైనా కీలక హామీలు లభిస్తే సరి. లేకుంటే ఎన్నికల్లో సహకరించలేమని తేల్చిచెప్పేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications