అమ్మఒడికీ కోతల సెగ ?- జగన్ మానసపుత్రికనూ వదిలిపెట్టని వైనం-ర్యాండమ్ సర్వే ప్రామాణికం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపకరించిన పథకాల్లో అమ్మఒడి కూడా ఒకటి. రెండేళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ పథకంలో ప్రభుత్వం మార్పులు చేయలేదు. అలాగే లబ్దిదారుల్లో ఎక్కువగా కోతలు కూడా విధించలేదు. కానీ రోజురోజుకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దారుణంగా మారుతుండటంతో అమ్మఒడిపైనా ఈ ప్రభావం పడటం ఖాయమైంది. ఇప్పటికే మిగతా పథకాల్లాగే అమ్మఒడిపైనా దృష్టిపెట్టిన జగన్ సర్కార్.. ర్యాండమ్ సర్వే చేయించింది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా అక్రమ లబ్దిదారుల పేరిట కోతలకు సిద్ధమవుతోంది.
జగన్ మానసపుత్రిక అమ్మఒడి
ఏపీలో అక్షరాస్యత రేటు పెంచే పేరిట వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకం సీఎం జగన్ మానసపుత్రికే. దేశంలో ఎక్కడా అమలు కాని విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి జగన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ.15 వేల చొప్పున స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రతీ ఏటా సంక్రాంతి సమయంలో ఇస్తున్న రూ.15 వేల రూపాయలు విద్యార్ధుల చదువులకు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే వాస్తవ పరిస్ధితి వేరేలా ఉంది. దీంతో ప్రభుత్వ ఉద్దేశంతో సంబంధం లేకుండా ఈ పథకం అందుకునేందుకు జనం అడ్డదారులు తొక్కడం మొదలైంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చికాకుగా మారింది.
అమ్మఒడిలో అక్రమాలు
అమ్మఒడి పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.15వేలు జమ చేయాల్సి ఉంది. అయితే ఇందులో వెయ్యి రూపాయలను స్కూళ్లలో టాయిలెట్ల కోసం తీసుకుని మిగతా రూ.14 వేలు మాత్రమే ఇస్తోంది. అయినా ఇది కూడా పెద్ద మొత్తమే కావడంతో అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అర్హత లేని ఎంతో మంది ఇందులో భాగంగా అమ్మఒడి పథకం కోసం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల అర్హతల్లో ఉన్న లొసుగుల్ని, సాంకేతిక లోపాల్ని వాడుకుంటూ భారీగా అమ్మఒడి పథకాన్ని పొందుతున్నారు. అయినా రెండేళ్లుగా ప్రభుత్వం మౌనంగానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి దారుణంగా మారడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో రంగంలోకి దిగిన అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
అమ్మఒడి పై ర్యాండమ్ సర్వే
రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి అక్రమాల పరిశీలన కోసం ప్రభుత్వం తాజాగా ర్యాండమ్ సర్వే చేయించింది. అంటే ప్రతీ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొందరు లబ్దిదారులపై పరిశీలన చేపట్టింది. ఇందులో అమ్మ ఒడి పథకంలో అక్రమాలు జరిగినట్లు ర్యాండమ్ సర్వేలో తేలిందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఒకే కుటుంబంలో ఒకరికే ఈ పథకం అందాల్సి ఉండగా.. ఇద్దరిద్దరు ప్రయోజనం పొందుతున్నట్లు తేలింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ నిర్ధారించింది. ఈ ఏడాది 44.48 లక్షల మందికి ఈ పథకం కింద రూ.15వేల చొప్పున జమచేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100మంది చొప్పున సర్వే చేస్తే 353 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ అయింది. దీంతో ర్యాండర్ సర్వేలోనే ఇన్ని అక్రమాలు బయటపడితే సమగ్ర సర్వే చేస్తే అసలు పథకంలో మూడో వంతు మందిని తీసేయాల్సి ఉంటుందని ఓ అంచనా.
అక్రమాలపై సర్కార్ సీరియస్
ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్న అమ్మఒడి పథకంలో అక్రమాల వ్యవహారం అధికార వర్గాలతో పాటు ప్రభుత్వంలోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో అమ్మఒడి పథకంలో అక్రమాలపై స్పందిస్తున్న ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకంలో ఏ మేరకు అక్రమాలు జరిగాయో విచారించాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లను డైరెక్టర్ చినవీరభద్రుడు ఆదేశించారు. దీంతో ఇప్పుడు వారంతా రంగంలోకి దిగి అక్రమాలపై దృష్టిపెట్టారు. త్వరలో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తే ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఈ వ్యవహారం తేలనుంది.
అమ్మఒడిలో మరో విడత కోతలు ?
గతంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రేషన్ కార్డుల్లో అక్రమాల పేరుతో 8 లక్షల కార్డుల్ని తొలగించారు. దీంతో ఈ కార్డుల ఆధారంగా అమ్మఒడి పథకం తీసుకుంటున్న వారిలో ఆ మేరకు కోత పడింది. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రేషన్ కార్డుల్లో కోతలు పెట్టిందన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి అక్రమాల పేరుతో ర్యాండమ్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఆ మేరకు అమ్మఒడి పథకంలో మరోసారి కోతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమ్మఒడి కోసం ఏటా రూ.6500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నిధుల్ని వివిధ సంక్షేమ శాఖలు, కార్పోరేషన్ల నుంచి మళ్లించాల్సి వస్తోంది. దీంతో అక్రమాల పేరిట భారీగా కోతలు విధించడం ద్వారా ఆ విమర్శల నుంచి కొంతమేరైనా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిధుల కోసం అమ్మఒడిలో కోతలు విధిస్తే లబ్దిదారుల నుంచి ఆ మేరకు వ్యతిరేకత తప్పదన్న ప్రచారం సాగుతోంది. దీంతో వీలైనంత మేరకు కోతలకు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం.
Recommended Video
జగన్ సర్కార్ కోతలపై విమర్శల వెల్లువ ?
జగన్ సర్కార్ తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో ఉంచుకని పలు ఛార్జీల పెంపుతో పాటు సంక్షేమ పథకాల్లోనూ భారీగా కోతలు విధిస్తోంది. ఇదే క్రమంలో అమ్మఒడిలోనూ కోతలు తప్పేలా లేవు. దీంతో ఇప్పటికే రేషన్ కార్డులతో పాటు పించన్లు కోల్పోయిన వారితో పాటు అమ్మఒడి లబ్దిదారులు కూడా లబోదిబోమంటున్నారు. వీరంతా ప్రభుత్వానికి ఓటేసినా, ఓటేయకపోయినా పథకాల లబ్ది చేకూరుస్తున్నట్లు ఇప్పటివరకూ చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు కోతల ద్వారా ఏం సందేశం ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. దీంతో సంక్షేమ కోతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లబ్దిదారులకు ఓసారి అర్హులని గుర్తించి సంక్షేమ పథకం ఇచ్చాక మధ్యలో లాక్కోవడం కుదరదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు.