ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం-సివిల్స్ క్వాలిఫై అయితే లక్షన్నర.. !
ఏపీలో ఇప్పటికే భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఈ మేరకు తాజాగా కేబినెట్లో ఆమోద ముద్ర వేసిన ఈ పథకం అమలు కోసం ఇవాళ మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఈ పథకం లబ్దిదారులు ఎవరు, వారికి ఈ పథకం కింద కలిగే లబ్ది ఎంత అన్న విషయాల్ని మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఏపీలో యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఎక్కువ మంది పాల్గొనేలా ప్రోత్సహించేందుకు వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్ధులను ప్రోత్సహించేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఓ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం సివిల్స్ పరీక్షల్లో అర్హత సాధించిన బలహీన వర్గాల అభ్యర్ధులకు ఈ పథకం కింద ప్రోత్సాహకాన్ని అందజేస్తారు.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద ప్రతీ ఏటా సివిల్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వారికి లక్ష రూపాయలు అందచేయనున్నారు. అలాగే మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి అదనంగా మరో 50 వేల ఆర్ధిక సాయం ఇస్తారు. ఈ మేరకు ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేసింది. ఇందులో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందు పరిచారు. అలాగే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా చెప్పారు.
ప్రతీ ఏటా యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్ పరీక్షల్లో ఏపీ నుంచి 40 మంది వరకూ అర్హత సాధిస్తున్నారని, ఈ సంఖ్య మరింత పెంచేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఇందులో తెలిపారు. విద్యాపరంగా, ఆర్ధికంగా వెనుకబడిన , బలహీన వర్గాల అభ్యర్ధులకు ప్రిలిమ్స్ కు అర్హత సాధిస్తే లక్ష రూపాయలు ప్రోత్సహకం కింద ఇస్తామని, అలాగే మెయిన్స్ కు కూడా అర్హత సాధిస్తే మరో 50 వేలు అందచేస్తామని తెలిపారు.
ఈ పథకం లబ్ది పొందేందుకు దరఖాస్తుదారులు ఏపీ వారై ఉండాలని, బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావాలని పేర్కొన్నారు. సివిల్స్ పరీక్ష ఎన్నిసార్లు రాసిన వారికైనా ఇది వర్తిస్తుందన్నారు. అలాగే ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వారి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు దాటకూడదని నిబంధన పెట్టారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద కేంద్రం పెట్టిన ఇతర నిబంధనలు కూడా వర్తింపచేస్తున్నారు.












Click it and Unblock the Notifications