మిథున్రెడ్డి, చెవిరెడ్డికి భారీ ఊరట- ఎయిర్ఇండియా సిబ్బందిపై దాడి కేసులు ఎత్తేసిన జగన్ సర్కార్
ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమ పార్టీ నేతలపై గత ప్రభుత్వాల హయాంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం సర్వసాధారణమవుతోంది. గతంలో టీడీపీ హయాంలో ఇదే జరగగా... ఇప్పుడు వైసీపీ హయాంలోనూ అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వందల మంది వైసీపీ నేతలపై గత టీడీపీ సర్కారు నమోదు చేసిన కేసులను వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే ఉపసంహరించుకోగా.. ఇప్పుడు తమ పార్టీకి చెందిన సన్నిహిత ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను సీఎం జగన్ ఉపసంహరించుకున్నారు.
ఎయిర్ ఇండియా మేనేజర్పై దౌర్జన్యం కేసు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణానికి వచ్చిన వైసీపీ ఎంపీ మిధున్రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్పై దౌర్జన్యం చేశారు. తాము చెప్పినట్లు వినలేదన్న కారణంతో ఆయన్ను వీరిద్దరూ చెంపదెబ్బ కొట్టినట్లు అప్పట్లో స్ధానిక ఏర్పేడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అప్పటి నుంచీ మిధున్రెడ్డి. చెవిరెడ్డి నిందితులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై దాడి కేసు తీవ్రమైనది కావడంతో వీరికి శిక్ష పడుతుందని భావిస్తుందని భావిస్తున్న తరుణంలో సీన్ మారిపోయింది.
మిధున్రెడ్డి, చెవిరెడ్డికి సర్కార్ ఊరట
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పాత కేసు నుంచి మిధున్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి విముక్తి లభించింది. వీరిపై నమోదైన కేసుల్లో వీరి పేర్లను తొలగిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. హోంశాఖ ఇచ్చిన జీవోలో వీరితో పాటు మరో 18 మందిపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీపీని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సూచించింది. గతేడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Recommended Video
మిధున్రెడ్డిపై ఇతర కేసులూ ఎత్తివేత
సీఎం జగన్కు సన్నిహితుడు, క్లాస్మేట్ కూడా అయిన వైసీపీ ఎంపీ మిధున్రెడ్డిపై రేణిగుంట ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా మేనేజర్పై దాడి కేసుతో పాటు ఇతర కేసులను కూడా ఎత్తేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 2009లో ఓ కారును అడ్డగించి అందులో వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసిన కేసులోనూ మిధున్రెడ్డి పేరును ప్రభుత్వం ఉపసంహరించింది. అలాగే 2015లో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించి అక్రమంగా చొరబడినట్లు నమోదైన కేసును కూడా వైసీపీ సర్కార్ ఉపసంహరించుకుంది. దీంతో మిధున్రెడ్డిపై నమోదైన అన్ని కేసులు ఎత్తేసినట్లయింది.