పతాకస్ధాయికి జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వార్- హైకోర్టుకు సర్కార్-అధికారులు భయపడొద్దన్న ఎస్ఈసీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ, వైసీపీ సర్కారుకూ మధ్య సాగుతున్న పోరు ఇవాళ పతాక స్దాయికి చేరుకుంది. మంత్రి నిమ్మగడ్డ అధికారులపై చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎస్ఈసీ ఆయన హౌస్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వగా.. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు అధికారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికలు సాగుతున్నంత సేపూ తానే సుప్రీం అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అభయం ఇచ్చారు.

పీక్ స్టేజ్లో జగన్, నిమ్మగడ్డ వార్
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందే మొదలైన ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం వార్ రెండో దశ ఎన్నికలకు చేరుకున్నా ఇంకా అప్రతిహతంగా కొనసాగతోంది. ఇదే క్రమంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎస్ఈసీ నిర్ణయాలే ఫైనల్ అని తెలిసినా వాటిని ప్రతీరోజూ ధిక్కరిస్తూ నిమ్మగడ్డపై విమర్శలకు దిగుతున్న ప్రభుత్వానికి కళ్లేం వేసేందుకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలంటూ డీజీపీకి ఇవాళ ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం భగ్గుమంది. ఈ ఆదేశాలు ఎలా అమలవుతాయో చూస్తామంటూ రంగంలోకి దిగిన ప్రభుత్వం వీటిపై హైకోర్టును ఆశ్రయించింది.

పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్పై హైకోర్టుకు ప్రభుత్వం
మంత్రి పెద్దిరెడ్డి ఉద్యోగులను బెదిరించడం, తనపై విమర్శలకు దిగిన వ్యవహారంలో ఆయన్ను హౌస్ అరెస్టు చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తామని ప్రభుత్వం స్వయంగా ప్రకటించించింది. అదే సమయంలో నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు నిలిపేయాలంటూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ, రేపు కోర్టు సెలవులు కావడంతో హౌస్ మోషన్లో తమ పిటిషన్ విచారించాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

ఉద్యోగులకు నిమ్మగడ్డ భరోసా
సర్కారు బెదిరింపుల నేపథ్యంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ భరోసా ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, రిటర్నింగ్ అధికారులు అభద్రతకు లోను కావొద్దని నిమ్మగడ్డ కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఈసీ అనుమతి తప్పనిసరని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు.

ఎంత పెద్దవారైనా భయపడొద్దన్న నిమ్మగడ్డ
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ఎంత పెద్దవారు బెదిరించినా భయపడొద్దంటూ నిమ్మగడ్డ వారిలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అనైతికం అన్నారు. ఉద్యోగుల పట్ల దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే, వ్యవస్ధలు మాత్రం శాశ్వతమని నిమ్మగడ్డ ఉద్యోగులకు గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులకు నిమ్మగడ్డ భరోసా ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications