AB Venkateswara Raoకు జగన్ సర్కార్ షాక్-ప్రెస్ మీట్ పై సీరియస్-మెమో జారీ-హెచ్చరిక
మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో షాకిచ్చింది. ఆయనపై నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలతో సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ పై సీరియస్ అయింది. దీంతో ఏబీకి ఛార్జిమెమో జారీ చేసింది. దీంతో ఆయన ఇరుకునపడ్డారు.
గత నెల 21న ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సీఎంవోలో పనిచేస్తున్న పీఆర్వో పూడి శ్రీహరితో పాటు ఇతరులు తనపై చేసిన ఆరోపణలకూ, ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ కూ పొంతన లేదని ఆరోపించారు. అంతే కాదు వారిపై వరువు నష్టం దావా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత నెల 21వ తేదీ AB వెంకటేశ్వరరావు పెట్టిన ప్రెస్ మీట్ ను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం..సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావుకు మెమో జారీ చేసింది. మీడియా తో మాట్లాడడం పై వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీస్ పంపారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని ఇందులో సమీర్ శర్మ తెలిపారు. అందుకే వివరణ కోరుతూ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ఏబీ తన ప్రెస్ మీట్లో పెగాసస్ తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్ జారీ అయింది. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని అందులో సీఎస్ హెచ్చరించారు. ఏబీవీ మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ నోటీస్ పంపినట్లు తెలుస్తోంది. దీనిపై ఏబీ ఏ వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది.