మార్గదర్శికి మరిన్ని షాక్ లు- 604 కోట్ల విలువైన 23 గ్రూప్ ల నిలిపివేత ! సీబీఐ, ఈడీ దర్యాప్తు?
ఏపీలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్స్ కు ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో భారీగా ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇవాళ మరిన్ని చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్స్ కు చెందిన 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా గ్రూపుల్లో లావాదేవీలకు అవకాశం లేకుండా చేశారు. అలాగే త్వరలో మార్గదర్శి చిట్స్ పై కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నిస్తోంది.
మార్గదర్శి అక్రమాల కేసులో ఇవాళ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 23 చిట్ గ్రూపుల్ని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి టర్నోవర్ రూ.604 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని అనంతపురం, అరండల్ పేట, నరసరావుపేట, విశాఖ, తణుకు, రాజమండ్రి బ్రాంచ్ ల పరిధిలో ఈ గ్రూపులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో అతిపెద్ద చిట్ ఫండ్ స్కాం ను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఈ స్కాంపై దర్యాప్తు చేయమని కోరినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతున్నందునే రిజిస్ట్రేషన్ల శాఖ ఇవాళ చిట్ గ్రూపు లను నిలిపేసినట్లు సమాచారం.
మార్గదర్శి అక్రమాలపై ఇప్పటివరకూ జరిగిన తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఇందులో మనీలాండరింగ్, కార్పోరేట్ మోసాలు కూడా జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. వాటి ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీలను దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే సీఐడీ విజ్ఞప్తిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications