అమరావతి తీర్పుపై హైకోర్టులో జగన్ సర్కార్ రివ్యూ పిటిషన్ ? సుప్రీంకు రైతులు-విచారణ వాయిదా
ఏపీలో అమరావతి రాజధాని పనుల వ్యవహారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు పనులు జరగడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారిస్తున్న సమయంలోనే రైతులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టులో రైతులు దాఖలు చేసిన ఎస్ఎల్పీ అంశం ఇవాళ విచారణ సందర్భంగా చర్చకు వచ్చింది.
రాజధాని పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును పరిశీలించిన హైకోర్టు.. రైతుల తరఫున న్యాయవాది వాదనలు విన్నది. రాజధానిలో ఎటువంటి పనులు చేపట్టలేదని, పురోగతి కూడా లేదని.. రైతుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ వేశారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు తీర్పులో రైతుల పరిహారానికి సంబంధించి తిరస్కరించడంతో.. దానిపై మాత్రమే ఎస్ఎల్పీ వేశామని, హైకోర్టు తీర్పును మాత్రం వ్యతిరేకించలేదని రైతుల తరఫు న్యాయవాది తెలిపారు.
అలాగే ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారా? అని ఏజీని హైకోర్టు ధర్మాసనం ప్రశ్మించింది. దీనిపై స్పందించిన ఏజీ.. అమరావతిపై తీర్పును సమీక్షించాలని హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్లో ఉన్న సమయంలో.. హైకోర్టులో విచారణ సబబా? అని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పులో తాము కోరిన అంశాలు తిరస్కరించడంతో.. వాటిపై మాత్రమే సుప్రీం కోర్టుకు వెళ్లామని రైతుల తరఫు లాయర్ మురళీధర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో తీర్పును అమలు చేయకపోవడంతోనే.. హైకోర్టులోనే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేశామన్నారు. అయితే ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆ నివేదికపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాజధాని కేసులపై విచారణ ను అక్టోబర్ 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.